– ఆడబిడ్డల భద్రతకు పూర్తి హామీ ఇచ్చేలా కట్టుదిట్టమైన నివారణ చర్యలు
– మానవ అక్రమ రవాణా పై సమస్యలు రాకముందే నివారణే ప్రభుత్వ ధ్యేయం
– మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమస్యలు ఉద్భవించిన తరువాత వాటికి పరిష్కారాలు వెతకడం కంటే, అవి తలెత్తకముందే కట్టుదిట్టమైన నివారణ చర్యలను అధికారులు సమర్థవంతంగా అమలు చేస్తే అనుకూల ఫలితాలు ఉంటాయని మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ. సూర్యకుమారి తెలిపారు.
స్థానిక బందరు రోడ్డు బెంజ్ సర్కిల్ సమీపంలోని జేడ్ సూట్స్ హోటల్ లో మంగళవారం మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రాంతీయ స్థాయిలో బాలికల సంరక్షణ మరియు మానవ అక్రమ రవాణా నిరోధం పై శిక్షకులకు శిక్షణ (Regional Level Training of Trainers (TOT) on Presentation of Human Traffecking and Girl Child Safety) అనే అంశం మీద శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఏ. సూర్య కుమారి హాజరై మాట్లాడుతూ.. బాలల రక్షణ, మహిళా సాధికారత కోసం మహిళలు, గర్ల్ చైల్డ్స్ కోసం ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టడంతోపాటు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ పథకాల సమన్వయానికి ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ (DMC) ను నోడల్ అధికారిగా నియమించినట్లు వెల్లడించారు. యువకుల కోసం ‘యువ’, బాలికల కోసం ‘సఖి’ గ్రూపులను ఏర్పాటు చేసి, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 23 లక్షల మంది పిల్లలను గ్రూపులుగా చేశామన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, రెసిడెన్షియల్ సంస్థలు, బడి బయట పిల్లలతో సహా 100 శాతం కవరేజ్ సాధించడమే లక్ష్యమని చేస్తామన్నారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తూ, వారి గౌరవాన్ని మానవ అక్రమ రవాణా దోచుకుంటుందన్నారు.
కుటుంబ వ్యవస్థలో వస్తున్న మార్పులు, సోషల్ మీడియా ప్రభావం వల్ల యువత తప్పుదారిలోకి వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లల భద్రతకు టోల్ ఫ్రీ నంబర్ 112, వన్-స్టాప్ సెంటర్స్ ద్వారా అత్యవసర సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సమస్యలు వచ్చిన తర్వాత కాకుండా, ముందస్తు నివారణే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని, బాలల భద్రత, మహిళా సాధికారతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అధికారులకు కార్యదర్శి ఏ. సూర్యకుమారి తెలియజేశారు.
ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు పద్మశ్రీ సునీతా కృష్ణన్ మాట్లాడుతూ… ట్రాఫికింగ్ విముక్తి, నివారణా కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సామాజిక కార్యకర్త సునీతా కృష్ణన్ మానవ అక్రమ రవాణా బాధితుల దయనీయ పరిస్థితిని వివరించారు. సాంకేతికతకు ప్రతి ఒక్కరూ బాధితులుగానే ఉంటున్నారని, అక్రమ రవాణాలో చిక్కుకున్న అమ్మాయిలలో 25–30 శాతం మంది హెచ్ఐవి బారిన పడుతున్నారని, వారు తీవ్ర శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులను తిరిగి సాధారణ జీవితంలోకి తీసుకురావడం ఎంతో క్లిష్టమని, షెల్టర్ హోమ్స్ అనుభవాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. మానవ అక్రమ రవాణాను అరికట్టడమే కాకుండా, అసలు జరగకుండా ముందస్తు నివారణ (Prevention) అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏటా సుమారు 30 లక్షల మంది అక్రమ రవాణాకు గురవుతుండగా, అందులో 45 శాతం మంది పిల్లలేనని తెలిపారు. వేశ్యావృత్తి మాత్రమే కాకుండా బాల కార్మికులు, అక్రమ దత్తతలు, అవయవ వ్యాపారం కోసం కూడా మహిళలు, పిల్లలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2003లోనే దేశంలో తొలిసారిగా అక్రమ రవాణా నిరోధక పాలసీని అమలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో అందుతున్న సహకారాన్ని అభినందించారు.
కార్యక్రమంలో మిషన్ వాత్సల్య జాయింట్ డైరెక్టర్ ఎం. శిరీషా, మిషన్ శక్తి జాయింట్ డైరెక్టర్ (ఇన్ చార్జ్) ఎస్. నాగ శైలజ, జాయింట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్. సునంద, అసిస్టెంట్ డైరెక్టర్ పి. లావణ్య, ఎన్టీఆర్ జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పీడీ షేక్ రుక్సానా సుల్తానా బేగం, నోడల్ ఆఫీసర్ సాయి శైలజ, ప్రజ్వల జూనియర్ డైరెక్టర్ మహ్మద్ అలీ, తదితరలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News