రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం కలెక్టరేట్లో రేనాటి వీరుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటిష్ వలస పాలకుల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిన వడ్డే ఓబన్న జీవితం ప్రతి భారతీయుడికి ప్రేరణగా నిలుస్తుందని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ టి. సీతారామ మూర్తి పేర్కొన్నారు. మన ప్రాంతంలో అల్లూరి సీతారామరాజు ఎలాంటి విప్లవాత్మక పాత్ర పోషించారో, రాయలసీమ ప్రాంతంలో వడ్డే ఓబన్న అదే విధంగా తనదైన ముద్ర వేశారని తెలిపారు. అటువంటి మహానీయుల నుంచి స్ఫూర్తి పొందాలని ఆయన పిలుపునిచ్చారు. బీసీల ఆత్మగౌరవానికి పెద్దపీట వేస్తూ వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు ప్రభుత్వం శాశ్వత జీవో జారీ చేయడం అభినందనీయమని తెలిపారు. అనంతపురం పట్టణంలో రాష్ట్ర స్థాయి జయంతి వేడుకలు నిర్వహించనుండగా, అన్ని జిల్లా కేంద్రాల్లోనూ జయంతి వేడుకలు జరుగుతు న్నాయని, అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. వడ్డే ఓబన్న చేసిన త్యాగాలు, ఆయన పోరాట పటిమను యువతకు తెలియజేయడం మన అందరి బాధ్యత అని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతి వేడుకలను నిర్వహించడం జరిగిందని జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ అధికారి బి. శశాంక, బీసీ అధికారి సుబ్బారావు, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కె.ఎన్. జ్యోతి, జిల్లా అధికారులు, వడ్డెర సామాజిక వర్గ పెద్దలు, వివిధ సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News