– మరో ఆరు సూచికల్లో శత శాతం లక్ష్యంగా సంపూర్ణతా అభియాన్ 2.0
– తొలి దశ విజయం స్ఫూర్తితో మలిదశకు కార్యాచరణ
– ఆకాంక్షిత బ్లాకు ఆదర్శ బ్లాకు స్థాయికి ఎదగాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
ఇబ్రహీంపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర ప్రభుత్వ ఆకాంక్షిత బ్లాకు అయిన ఇబ్రహీంపట్నంలో సంపూర్ణతా అభియాన్ తొలిదశ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ స్ఫూర్తితో సంపూర్ణతా అభియాన్ 2.0ను ప్రారంభించినట్లు కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఇబ్రహీంపట్నం మండల ఎంపీడీవో కార్యాలయంలో శనివారం జరిగిన సంపూర్ణతా అభియాన్ 2.0 ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ.. శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆకాంక్షిత బ్లాకులు అయిన ఇబ్రహీంపట్నం, పెనుగంచిప్రోలులో సంపూర్ణతా అభియాన్ తొలిదశ కార్యక్రమంలో భాగంగా ఆరు ముఖ్య సూచికల్లో 100 శాతం ప్రగతి సాధించాయని.. ఇప్పుడు మరో ఆరు కీలక సూచికల్లో 100 శాతం లక్ష్యాల సాధనకు సంపూర్ణతా అభియాన్ రెండోదశ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి మొదలు ఏప్రిల్ వరకు కొనసాగుతుందన్నారు. పోషణ విభాగంలో పిల్లలకు పోషకాహారం అందించడం, పిల్లల ఎదుగుదల, అంగన్వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం ఈ నాలుగు సూచికల్లో 100 శాతం లక్ష్యాలను చేరుకోవాల్సి ఉందన్నారు. ఇదేవిధంగా విద్యాశాఖకు సంబంధించి అన్ని పాఠశాలల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు సౌకర్యం కల్పించడం, పశుసంవర్థక శాఖకు సంబంధించి అన్ని పశువులకు నోటిపూత వ్యాధి నివారణ టీకాలు వేయించడంలో శత శాతం ప్రగతి సాధించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆరు సూచికల్లో ఇప్పటికే మెరుగైన ప్రగతి ఉందని.. అయితే శతశాతం అనేది కార్యక్రమం లక్ష్యమన్నారు. లక్ష్యాల సాధనకు అవసరమైన సహాయసహకారాలు అందించడం జరుగుతుందని వెల్లడించారు.
ఆరోగ్యం – పోషణ, విద్య, వ్యవసాయం-అనుబంధ రంగాలు, ప్రాథమిక మౌలిక వసతులు, సామాజిక అభివృద్ధిలోని 40 సూచికల్లోనూ పూర్తి ఫలితాలు సాధించేవరకు ప్రగతిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతోందన్నారు. వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ఈ సూచికల్లో పురోగతి ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఆకాంక్షిత బ్లాకులను ఆదర్శ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు వివిధ శాఖలు, ఫ్రంట్ లైన్ వర్కర్లు, ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ముందుకెళ్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ వివరించారు.
దేశాన్ని అత్యున్నతంగా నిలబెట్టాలి: ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్
మన దేశాన్ని ప్రపంచంలో అత్యున్నత స్థానంలో నిలబెట్టేందుకు గౌరవ ప్రధానమంత్రి కృషిచేస్తున్నారని.. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి విజన్ @ 2047ను ఆవిష్కరించారని శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. అభివృద్ధికి సంబంధించి ఎక్కడ లోపం ఉందో గుర్తించి.. అక్కడ ప్రత్యేకంగా దృష్టిపెట్టి శతశాతం అభివృద్ధిని సాధించడమే ఆకాంక్షిత బ్లాకు కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతిఒక్కరికీ చేర్చాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. బడగుబలహీన వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న ఇబ్రహీంపట్నం మండలంలో విద్య, వైద్యం, ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టినట్లు తెలిపారు. ఆరోగ్య ఆంధ్ర సాకారానికి ప్రతిఒక్కరూ కృషిచేయాల్సిన అవసరముందన్నారు. అమృత్ 2.0 ద్వారా త్వరలో తాగునీటి సమస్య తీరనుందన్నారు.
కార్యక్రమంలో భాగంగా మహిళా శిశు సంక్షేమం, విద్యాశాఖ, పశుసంవర్థక శాఖల ఆధ్వర్యంలో మొత్తం ఆరు స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిద్వారా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. అదేవిధంగా ఇగ్నైట్ సెల్ను ఏర్పాటు చేశారు. వీటిద్వారా వివిధ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అందుబాటులో ఉన్న మార్గాలపై అవగాహన కల్పించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి ప్రోత్సహించేందుకు ఇగ్నైట్ సెల్ ఉపయోగపడుతోంది. సంపూర్ణతా అభియాన్ 2.0కు సంబంధించి థీమ్ వారీగా పోస్టర్లను, లోగోను ఆవిష్కరించారు.
కార్యక్రమంలో ఎంపీపీ పాలడుగు జ్యోత్స్న, విజయవాడ ఆర్డీవో కావూరి చైతన్య, డీఈవో ఎల్.చంద్రకళ, ఐసీడీఎస్ పీడీ రుక్సానా సుల్తానా బేగం, పశు సంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఎంపీడీవో డి.శకుంతల, ఏబీపీ బ్లాక్ కోఆర్డినేటర్ పి.శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Prajavartha Online Telugu News