అమరావతి/ రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి:కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ చారిత్రాత్మకమని, ఇది దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా మార్చే దిశగా ఉందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఈ బడ్జెట్ ఎంతగానో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
బడ్జెట్ లో పర్యాటక రంగానికి పెద్దపీట: మంత్రి దుర్గేష్
పర్యాటక శాఖ మంత్రిగా, ఈ రంగంపై కేంద్రం చూపిన చొరవను మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర బడ్జెట్లో పర్యాటక రంగానికి పెద్దపీట వేయడం అత్యంత సంతోషదాయకమని మంత్రి తెలిపారు. రాష్ట్ర పర్యాటక రంగానికి ఇప్పటికే కేంద్రం సుమారు రూ. 450 కోట్ల నిధులతో సహకరించిందని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో ఏపీకి మరిన్ని అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రాజెక్టులు రావడంతో పాటు, విశేషంగా నిధులు మంజూరవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్రం ప్రకటించిన నిధుల వివరాలను మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఏపీకి కీలకంగా మారే పోలవరం ప్రాజెక్టుకు రూ. 3,320.39 కోట్లు, అమరావతి రాజధాని అభివృద్ధికి రూ. 1,128.91 కోట్లు, అమరావతి సమీకృత పట్టణాభివృద్ధి రూ. 432.09 కోట్లు, గ్రామీణ రహదారి ప్రాజెక్టులకు రూ. 500.99 కోట్లు, పట్టణ తాగునీరు & మురుగు నీటి నిర్వహణకు రూ. 800.00 కోట్లు, రహదారులు, వంతెనల పునర్నిర్మాణంకు రూ. 350.00 కోట్లు, ప్రకృతి వ్యవసాయానికి రూ. 155.32 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు.
యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాల కల్పనపై బడ్జెట్ పూర్తి దృష్టి సారించిందని మంత్రి దుర్గేష్ అన్నారు. హై స్పీడ్ కారిడార్లు, మౌలిక వసతుల కల్పనలో దేశం అగ్రగామిగా నిలిచేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూనే, టెక్నాలజీని సామాన్యుడికి చేరువ చేయడం హర్షణీయమన్నారు.
ఈ బడ్జెట్ ద్వారా సంక్రమించిన నిధులను సమర్థవంతంగా వినియోగించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
Prajavartha Online Telugu News