-పార్లమెంటు అవతరణంలో నిరసన తెలిపిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు
ఢిల్లీ, నేటి పత్రిక ప్రజావార్త:
కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు లక్ష్యంగా దాడులు, అక్రమ కేసులు పెరిగిపోయాయని వెరసి శాంతి భద్రతలు విఫలమయ్యాయని వైఎస్ఆర్సీపీ ఎంపీలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం పార్లమెంటు ఆవరణంలో ప్లకార్డులతో నిరసన చేపట్టారు.
ఇళ్లు, కార్లు తగులబెట్టడం, తప్పుడు కేసులు నమోదు చేసి వేధించడం వంటి దుశ్చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలిపారు. రాజ్యాంగ పాలనకు బదులు సొంతంగా రూపొందించుకున్న ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ను అమలు చేస్తున్నట్లుగా పరిస్థితి మారిందని, దీనివల్ల ప్రజలకు, ప్రతిపక్షాలకు న్యాయం పూర్తిగా దూరమైందని తీవ్రంగా విమర్శించారు.
మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్, విడదల రజిని ఇళ్లపై జరిగిన దాడులను ప్రస్తావిస్తూ, ఇవి కూటమి ప్రభుత్వ ప్రతీకార రాజకీయాలకు స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని, పోలీసులు నిస్సహాయ స్థితిలో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఈ పరిస్థితిపై ప్రధాని, కేంద్ర హోం మంత్రి వెంటనే జోక్యం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలను పునరుద్ధరించాల్సిన బాధ్యత తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.
Prajavartha Online Telugu News