గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో ఎలాంటి లోపాలకు తావులేదని, ఎక్కడైనా సిబ్బంది, అధికారులు, సచివాలయ సెక్రెటరీలు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సోమవారం ముత్యాలరెడ్డి నగర్, వికాస్ నగర్, జేకేసీ రోడ్, మ్యాంగో స్ట్రీట్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్దేశిత ‘పిన్ పాయింట్ ప్రోగ్రాం’ లేకుండా విధుల్లో ఉన్న 112వ వార్డు శానిటేషన్ కార్యదర్శిపై కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సదరు కార్యదర్శికి తక్షణమే షోకాజ్ నోటీసు జారీ చేయాలని సిఎంఓహెచ్ ని ఆదేశించారు.
ఈ సందర్భంగా కమిషనర్ పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను పరిశీలించిన అనంతరం అధికారులకు కీలక సూచనలు చేశారు. ప్రతి సచివాలయం పరిధిలో నిర్దేశిత పిన్ పాయింట్ ప్రోగ్రాం మేరకు పారిశుధ్య పనులు జరగాలని, ఎక్కడైనా పిన్ పాయింట్ మేరకు లేకుంటే సంబందిత సిబ్బందిని విధుల నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. మధ్యాహ్నం సమయంలో చేపట్టే గ్యాంగ్ వర్క్ పనులు మరింత సమర్థవంతంగా జరగాలని, విధుల్లో పారిశుధ్య కార్మికుల హాజరు నూరు శాతం ఉండేలా పర్యవేక్షించాలని సూచించారు. డ్రైన్ల క్లీనింగ్ పనులను ఎప్పటికప్పుడు పూర్తి చేయడంతో పాటు, ఇంటింటి చెత్త సేకరణ ప్రక్రియ నూరు శాతం పక్కాగా జరిగేలా చూడాలన్నారు. పారిశుధ్య మెరుగుదలలో భాగంగా నగరంలో అవసరమైన ప్రాంతాలను గుర్తించి తక్షణమే క్లస్టర్ కంపోస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే, నగరంలోని ఖాళీ స్థలాలను గుర్తించి వెంటనే వాటిలో జీఎంసీ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని, నోటీసులు ఇచ్చినా స్పందించని ఖాళీ స్థలాల యజమానులపై తక్షణమే అపరాధ రుసుం (పెనాల్టీ) విధించాలని ప్రజారోగ్య అధికారులకు స్పష్టం చేశారు. వ్యాపార సంస్థలు తప్పనిసరిగా కమర్షియల్ ఏజన్సీకే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. గార్బేజ్ వల్నర్బుల్ పాయింట్స్ ఉండడానికి వీలు లేదని, ఎస్ఎస్ లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. డ్రైన్లకు సమాంతరంగా ఉన్న త్రాగునీటి పైప్ లైన్లను గుర్తించి, వాటిని షిఫ్ట్ చేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో సిఎంఓహెచ్ డాక్టర్ శాంతికళ, ఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనారాయణ, కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, ఎస్ఎస్ సోమశేఖర్, ప్రజారోగ్య, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News