– సరైన అవగాహనతో రైతులు ముందడుగు వేయాలి
– దేశీయ గోజాతి పాల ఉత్పత్తులతో ఇటు రైతులకు, అటు వినియోగదారులకు మేలు
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని .. సరైన అవగాహనతో, సంప్రదాయ-ఆధునిక పాడి పరిశ్రమ పద్ధతులను అనుసరిస్తూ దేశీ జాతి ఆవులను పెంచితే రైతులకు సుస్థిర ఆదాయం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
కలెక్టర్ లక్ష్మీశ గురువారం వత్సవాయి మండలం, కంభంపాడులోని చేకూరి రమేష్బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాలను సందర్శించారు. ఈ గోశాలను ఆర్కేవీఐ పథకం కింద 2021లో రూ. 15 లక్షల రాయితీతో ఏర్పాటు చేయగా.. ప్రస్తుతం సాహివాల్, గిర్, పుంగనూరు, ఒంగోలు తదితర దేశీ జాతులకు చెందిన 55 ఆవులతో విజయవంతంగా ముందుకెళ్తోంది. ఇక్కడి ఆవుల నుంచి వచ్చే పాలతో ప్రీమియర్ క్వాలిటీ A2 నెయ్యి తయారుచేస్తున్నామని.. నెలకు దాదాపు 60 కిలోల నెయ్యిని ఉత్పత్తి చేస్తున్నామన్నారు. లీటరు నెయ్యిని రూ. 3,000కు మార్కెటింగ్ చేయడం జరుగుతోందన్నారు. సంప్రదాయ విధానంలో పాలను మరిగించి, పెరుగు చేసి, ఆపై చిలకడం ద్వారా వచ్చే వెన్నతో నెయ్యిని తయారుచేస్తున్నట్లు వివరించారు. ఆరోగ్యప్రదాయిని అయిన ఈ నెయ్యికి డిమాండ్ ఉందన్నారు. అదేవిధంగా పంచగవ్వ, ద్రవ జీవామృతం కూడా తయారుచేస్తున్నామని వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేయడంతో పాటు రైతులకు లాభదాయకంగా మారేలా ప్రభుత్వం పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. వీటి వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు రైతులకు అధిక ధర లభించే అవకాశం ఉందని వివరించారు. దేశీ జాతి ఆవుల పెంపకంపై రైతులు అవగాహన పెంపొందించుకోవాలని, పశువుల పోషణ, సంరక్షణ, పాల ఉత్పత్తి పెంపు వంటి అంశాల్లో పశుసంవర్ధక శాఖ అధికారులు అందించే సాంకేతిక సూచనలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఔత్సాహిక రైతులను గుర్తించి వారిని సంఘటితం చేసి A2 పాలు, నెయ్యి ఉత్పత్తి చేసేలా చేయూతనివ్వాలని కలెక్టర్ లక్ష్మీశ పశుసంవర్థక శాఖ అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట నందిగామ ఆర్డీవో కె.బాలకృష్ణ, జిల్లా పశుసంవర్థక అధికారి డా. ఎం.హనుమంతరావు, ఏడీ సత్యప్రసాద్, స్థానిక అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News