-మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యం
-జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్
-ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలి
-మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి
-ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు
-ప్రతి మహిళ “Think Big, Dream Big, Believe Big, Achieve Big” అనే సంకల్పంతో ముందుకు సాగాలి
-మున్సిపల్ కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల సాధికారతతోనే సమాజ అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం స్థానిక శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ మౌర్య తదితరులతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళల సాధికారత, అభివృద్ధి మరియు సమాజంలో వారి పాత్రను గుర్తించి గౌరవించేందుకు మహిళా దినోత్సవం ఒక ముఖ్యమైన సందర్భంగా నిలుస్తుందని తెలిపారు. మహిళలు కుటుంబం మరియు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. మహిళల జీవితంలో ఆర్థిక స్వేచ్ఛ, ఆరోగ్యం, ఆనందం అనే మూడు అంశాలు ఎంతో ముఖ్యమని, ఇవి ఉంటే కుటుంబం మరియు సమాజం మరింత బలపడుతుందని అన్నారు.
మహిళల ఆర్థిక స్వావలంబన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు అమలు చేస్తున్నాయని తెలిపారు. ముఖ్యంగా లక్షపతి దీదీ కార్యక్రమం ద్వారా మహిళలను ఆర్థికంగా బలపరచడం జరుగుతుందని చెప్పారు. తిరుపతి జిల్లాలో సుమారు 1.60 లక్షల లక్షపతి దీదీలు ఉన్నారని పేర్కొన్నారు. డిఆర్డిఏ, మెప్మా ఆధ్వర్యంలో మహిళా సంఘాల ద్వారా ఆర్థిక అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబంలో ఒక మహిళా పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు చేపడుతున్నదని చెప్పారు. గత ఏడాదిలో జిల్లాలో 10 వేలకుపైగా మహిళా పారిశ్రామికవేత్తలు తయారయ్యారని వెల్లడించారు. మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి నెలకు ₹50–60 వేల వరకు ఆదాయం పొందుతున్న ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో డిఆర్డిఏ, మెప్మా ఆధ్వర్యంలో 14,600 స్వయం సహాయక సంఘాలు ఉండగా, వాటిలో రెండు లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారని చెప్పారు. గత 11 నెలల్లోనే సుమారు ₹2,600 కోట్లకు పైగా రుణాలు మహిళా సంఘాలకు అందించామని తెలిపారు.మహిళల ఆరోగ్యం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. దీపం పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించడం వల్ల మహిళల ఆరోగ్యం మెరుగుపడిందన్నారు. తిరుపతి జిల్లాలో 10 లక్షల 88 వేల కుటుంబాలకు ఈ పథకం ప్రయోజనం అందుతున్నట్లు చెప్పారు.
అదేవిధంగా మహిళల సౌకర్యం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీశక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతి నెల సుమారు 28 లక్షల మంది మహిళలు ఈ పథకాన్ని వినియోగిస్తున్నారని చెప్పారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 1 కోటి 85 లక్షల ప్రయాణాలు జరిగాయని, దీనివల్ల మహిళలు ₹67 కోట్లకు పైగా ఆదా చేసుకున్నారని తెలిపారు. మహిళల ఆరోగ్య రక్షణ కోసం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు, టీకాలు అందిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరంలో జిల్లాలో 15 వేలకుపైగా ప్రసవాలు ఉచితంగా నిర్వహించబడినట్లు చెప్పారు. బాలికల ఆరోగ్య రక్షణ కోసం హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా, సామాజికంగా మరింత ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మాట్లాడుతూ… అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు కుటుంబ అభివృద్ధితో పాటు సమాజ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. గతంలో మహిళలు ఇంటి పనులకు మాత్రమే పరిమితమై ఉండగా, నేడు విద్య, వైద్యం, పరిపాలన, సాంకేతిక రంగాలు సహా అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా, కొన్నిచోట్ల మరింత ప్రతిభ కనబరుస్తూ దేశానికి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నారని పేర్కొన్నారు. మహిళలు ఇంజినీర్లు, డాక్టర్లు, కలెక్టర్లు, పోలీసు అధికారులు, పైలట్లు వంటి అనేక రంగాల్లో ముందుకు వచ్చి తమ ప్రతిభను చాటుతున్నారని తెలిపారు. మహిళల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని చెప్పారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చిందని తెలిపారు. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళల రాజకీయ భాగస్వామ్యాన్ని పెంచుతున్నామని అన్నారు. ప్రతి మహిళ తన శక్తి సామర్థ్యాలను గుర్తించి కుటుంబంతో పాటు సమాజం, దేశ అభివృద్ధికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మౌర్య మాట్లాడుతూ..మహిళా హక్కులపై అవగాహన పెంచడం మరియు మహిళా సాధికారత సాధించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. మహిళలకు సమాజంలో అవకాశాలు, మద్దతు కల్పిస్తే వారు మరింత శక్తివంతంగా ఎదుగుతారని పేర్కొన్నారు.
ఈ సంవత్సరానికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన “Rights, Justice and Action for All Women and Girls” అనే థీమ్ మహిళలు, బాలికల హక్కులను పరిరక్షించడంతో పాటు వాటిని ఆచరణలో అమలు చేయాలనే సందేశాన్ని ఇస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధిస్తేనే నిజమైన సాధికారత సాధ్యమవుతుందని చెప్పారు.
అలాగే మహిళల ఎదుగుదలలో మహిళలే మహిళలకు మద్దతుగా నిలవాలని సూచిస్తూ, ప్రతి మహిళ “Think Big, Dream Big, Believe Big, Achieve Big” అనే సంకల్పంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, పనబాక లక్ష్మి, డిప్యూటీ మేయర్ మునికృష్ణ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, రాష్ట్ర ఎస్సి సెల్ డైరెక్టర్ కుమారి, హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్, క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ స్రవంతి తదితరులు మాట్లాడుతూ మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు.
అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుతున్న ప్రసంగాన్ని వీడియో ద్వారా వీక్షించారు.
అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14,604 సంఘాలకు చెందిన 2,23,260 మంది మహిళా సభ్యులకు ₹2,616 కోట్ల 22 లక్షల రూపాయల రుణాలను మెగా చెక్కుల రూపంలో అందజేశారు. అలాగే 270 మంది ఎస్సీ మహిళలకు ఉన్నతి, పీఎం అజయ్, ఏపీఎస్సీసీఎఫ్సీ ద్వారా సబ్సిడీతో కూడిన ₹4 కోట్ల 44 లక్షల 50 వేల రూపాయల రుణాలను మెగా చెక్కుల రూపంలో అందజేశారు.
అనంతరం యూనివర్సిటీ ఆవరణంలో డి ఆర్ డి ఏ, మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్, మహిళా పోలీసు వారు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పీడీ, ఐసిడిఎస్ పీడీ, డీఈఓ, మెప్మా పీడీ, జీఎం ఇండస్ట్రీస్, ఎల్డీఎం, డిప్యూటీ కమిషనర్, జిల్లా అధికారులు, మహిళా పోలీసులు, ప్రజా ప్రతినిధులు, పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News