-స్టార్టప్ సంస్థల ద్వారా ప్రయోగాత్మకంగా 18 ఆస్పత్రుల్లో సరికొత్త ఆవిష్కరణలు
-సుమారు 40 పరికరాలతో 15 రకాల వ్యాధి నిర్ధారణ పరీక్షలు
-సర్వైకల్ క్యాన్సర్, గుండె జబ్బులు, టీబీ, ఇతర అనారోగ్యాల గుర్తింపు
-అత్యాధునిక సాఫ్ట్వేర్ ఆధారంగా కూడా వైద్య సేవలు
-తక్కువ సమయంలో వ్యాధుల నిర్ధారణ – వైద్య సేవల్లో నాణ్యత మరింత మెరుగు
-ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా తొలి అడుగులు, మరింత ముందుకు దూసుకువెళ్తాo
-వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 18 మంది ఇన్నోవేటర్లు ఏకకాలంలో రాష్ట్రంలో ఎంపికచేసిన 18 ప్రభుత్వాసుపత్రుల్లో సుమారు 40 పరికరాల ద్వారా పైలటు ప్రాజెక్టు కింద సరికొత్త ఆవిష్కరణల ద్వారా వైద్య సేవల్లో కీలకమైన స్క్రీనింగ్, కన్ఫర్మేషన్ పరీక్షలు చేస్తున్నారు. దీనివల్ల వైద్యులకు తక్కువ సమయంలో వ్యాధులు ఖరారుపై అవగాహనతో రోగులకు ఉన్నత చికిత్స అందించేందుకు సమయం ఆదా అవుతుంది. అలాగే రోగులకు ఊరట లభిస్తుంది. విశాఖ, అనంతపురం, గుంటూరు, కాకినాడ జీజీహెచ్, విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల, పార్వతీపురం, తెనాలి జిల్లా ఆసుపత్రి, ఇతరచోట్ల పైలట్ ప్రాజెక్ట్ విధానంలో రకరకాల పరీక్షలు చేస్తున్నాయి.
ఆసుపత్రుల్లో ‘ఏఐ’ సేవలు ఇలా
రోగులు, వైద్యుల మధ్య జరిగే సంభాషణను రికార్డింగ్ చేయడం, దగ్గు ద్వారా టీబీని గుర్తించడం, గుండె జబ్బులు, రక్తహీనతను గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ చికిత్సలో ఏఐ కెమెరా వినియోగం, చిన్నపిల్లల్లో న్యూరాలజికల్ డిజార్డర్స్, క్యాటరాక్ట్, గ్లూకోమా, సికిల్ సెల్ అనీమియా, రక్తహీనత, ఇతర పరీక్షలకు ఆధునిక సాంకేతిక పరికరాలను వినియోగిస్తున్నారు. అలాగే అవసరమైనచోట్ల అత్యాధునిక సాఫ్ట్వేర్ ను కూడా ఉపయోగిస్తున్నారు
త్వరలో సీఎంకు నివేదిక
ఇటీవల ఆసుపత్రుల్లో పైలట్ విధానంలో ప్రారంభమైన ఈ పరీక్షలు త్వరలో ముగియనున్నాయి. వీటి ఫలితాలపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. సీఎం ఆదేశాలు అనుసరించి, తదుపరి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఏఐ ఆధారిత సేవల ద్వారా తక్కువ సమయంలో నాణ్యమైన వైద్య సేవలను ఎక్కువ మందికి అందించేందుకు వీలవుతుందని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. ఈ సేవలను అబా ఐడి తో అనుసంధానం చేసి రోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తారని తెలిపారు.
సీఎం చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా… రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సహకారంతో!
ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు సంకల్పానికి అనుగుణంగా ‘రతన్లాటా ఇన్నోవేషన్ హబ్’ సహకారం, మంత్రి సత్యకుమార్ ఆదేశాలు అనుసరించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి సౌరభ్ తదుపరి చర్యలకు ఉపక్రమించారు. వైద్య సేవల్లో టెక్నాలజీ వినియోగంపై సౌరబ్ గౌర్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.
దేశవ్యాప్తంగా దరఖాస్తుల ఆహ్వానం
పారదర్శక చర్యల్లో భాగంగా నూతన ఆవిష్కరణలు చేసే వారి నుంచి దరఖాస్తులను ‘ఏపీ మెడ్క్ ఇన్నోవేషన్ చాలెంజ్’ పేరుతో దేశవ్యాప్తంగా దరఖాస్తులను ఆరోగ్యశాఖ ఆహ్వానించిoది. వీటి పరిశీలన, సిపార్సు కోసం ప్రత్యేకంగా ‘క్యాథ్’ (కమిటీ ఫర్ అప్లయిడ్ టెక్నాలజీస్ ఇన్ హెల్త్) కమిటీని ఏర్పాటుచేసింది. ఇందులో వైద్య, టెక్నాలజీ రంగాల్లో పేరు ప్రఖ్యాతలు కలిగిన డాక్టర్ వి.రామనాధన్ (ఇండియన్ ఇన్స్టిట్యూటు ఆఫ్ ఫైన్స్ బెంగళూరు), డాక్టర్ మోనా దుగ్గల్ (ఐసీఎంఆర్-డైరెక్టర్), డాక్టర్ సుహేల కపూర్ (ఏఐ నిపుణులు-ఐసీఎంఆర్), డాక్టర్ శివకుమార్ (ఫౌండర్ స్వస్తి- ఎన్జీఓ ఆర్గనైజేషన్), డాక్టర్ రాకేష్ కల్పల (ఏఐజీ హాస్పిటల్స్-హైదరాబాద్), సంగీత్కుమార్ (మెడ్క్ నిపుణులు), సర్వేశ్సింగ్ (మేనేజింగ్ డైరెక్టర్- మరిచి వెంచర్స్) లు సభ్యులుగా ఉన్నారు.
3 అంచెల్లో దరఖాస్తుల పరిశీలన- జాబితా ఖరారు
వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించిన ‘ఏపీ మెడ్క్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ పిలుపు అనుసరించి ప్రభుత్వానికి 297 నూతన అప్లికేషన్స్ వచ్చాయి. క్యాథ్ కమిటీ మూడు అంచెల్లో పరిశీలన జరిపి, చివరిగా 297లో 18 అప్లికేషన్స్ను ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. నిపుణుల కమిటీ వీటి ఎంపికలో అనేక జాగ్రత్తలు తీసుకుంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, ఖరారుకు మూడునెలల వరకు సమయం పట్టింది.
4 విభాగాల్లో పరీక్షలు
1.డయాగ్నస్టిక్ టూల్స్ కేటగిరి::
శాలిసిట్ టెక్నాలజీస్, సన్ఫాక్స్ టెక్నాలజీస్, ఆర్ట్ పార్క్, కాగ్నీటివ్ బోటిక్ టెక్నాలజీస్ సంస్థలు తాము ప్రతిపాదించిన అప్లికేషన్స్ ద్వారా ఎంపికచేసిన ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తున్నాయి.
చాగల్లు పీహెచ్సీ (వెస్ట్ గోదావరి), రాజానగరం ఉప ఆరోగ్య కేంద్రం (తూర్పుగోదావరి) అనంతపురం జీజీహెచ్, విశాఖలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఈ సంస్థలు పరీక్షలు చేస్తన్నాయి.
**
దగ్గు ద్వారా టీబీ గుర్తించడం, గుండె జబ్బులను ఎర్లీగా గుర్తించడం, చిన్న పిల్లలకు న్యూరాలజికల్ సమస్యలు కు అనుగుణంగా చికిత్స అందించడం, పూర్వ డేటా ఆధారంగా డెంగ్యూ జ్వరాల అవుటు బ్రేక్స్ ను ముందుగానే గుర్తించడం వంటి ప్రక్రియ ఈ ఆసుపత్రుల్లో కొనసాగుతోంది.
2.పోర్టబుల్ పాయింటు ఆఫ్ కేర్ కేటగిరి.
పెరివింకిల్ టెక్నాలజీస్, రెమిడియో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్, ప్రైమరీ హెల్త్ టెక్, హువెల్ లైఫ్ సైన్సెస్, సిగటపుల్ టెక్నాలజీ సంస్థలు డయాగ్నస్టిక్ సెంటర్లు లేకుండానే కేవలం సూటుకేసుల్లో ఇమిడిపోయే అత్యాధునిక పరికరాలతో రకరకాల పరీక్షలు చేస్తున్నాయి.
**
ప్రస్తుతం గుంటూరు జీజీహెచ్లో సర్వైకల్ క్యాన్సర్ను గుర్తిస్తున్నారు. ఇక్కడే క్యాటరాక్ట్, డయాబేటిక్ న్యూరోపతి వైద్యంలో పరికరాలు వినియోగిస్తూ రోగులను పరీక్షిస్తున్నారు.
*టీబీని నిర్ధారించే ఆర్టీపీసీఆర్ పరికరాలు, ఎనిమియా, టూకేమియాను ‘బ్లడ్ స్లైడ్’ ఆధారంగా గుర్తించే పరీక్షలు విజయవాడ జిజిహెచ్లో జరుగుతున్నాయి. విజయవాడ సిటీ డయాగ్నస్టిక్ సెంటర్లో ప్రత్యేకంగా సిద్ధంచేసిన సూటుకేసులోని కిట్ల ద్వారా షుగర్, కిడ్నీ, థెరాయిడ్, ఇతర రక్త పరీక్షలు చేస్తున్నారు.
3.స్మార్ట్ మానిటరింగ్ అండ్ వేరిబుల్స్ కేటగిరి (శరీరానికి ఉపపరికరాలు అమర్చి)
కేర్ఎన్ఎక్స్ ఇన్నోవేషన్స్, స్టార్టూన్ ల్యాబ్స్, వెల్లిటిక్స్, కార్డియో మెట్ కేర్ ప్లస్, ఇన్యాసిల్ టెక్నాలజీస్ సంస్థలు శరీరానికి అమర్చే ఉపపరికరాల సాయంతో నవజాత శిశువులకు అత్యవసర సమయాల్లో తేలికపాటి అక్సిజన్, కీళ్లనొప్పుల మూలాలను వెంటనే గుర్తించడం, వైద్యులు, రోగి మధ్య జరిగే సంభాషణను రికార్డు చేసి, రోగ నిర్ధారణ, ప్రిస్కప్షన్ సిద్ధంచేయడం వంటి పరీక్షలు పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రి, తెనాలి జిల్లా ఆసుపత్రి, విశాఖలోని విక్టోరియా ఆసుపత్రి, కాకినాడ జీజీహెచ్, పార్వతీపురం జిల్లా ఆసుపత్రుల్లో జరుగుతున్నాయి.
4.రిమోట్ కేర్ టెలిమెడిసిన్ కేటగిరి.
మోనేరి ఏఐ, రెజువెన్ మెడికేర్, వ్యూహ మెడేటా, డీప్ ఫాక్ట్స్ సంస్థలు రక్త నమూనా తీసుకోకుండానే కంటి ఫొటోతో రక్తహీనత గుర్తించడం, స్కెతస్కోపునకు అదనంగా చిన్న పరికరాన్ని అమర్చి, ఈసీజీ లేనిచోట్ల గుండె సమస్యలు గుర్తించడం, సర్వైకల్ క్యాన్సర్ను గుర్తించడం, ఐసీయూల్లో ఉండే రోగులకు పరికరాలు అమర్చి నిరంతరం బీపీ, పల్స్, శరీర ఉష్ణోగ్రత, ఇతర మానిటరింగ్ పరీక్షలు చేస్తున్నారు. పాడేరు జీజీహెచ్, కర్నూలు, అనంతపురం జీజీహెచ్, తిరుపతి రుయాలో ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
వైద్యులు వర్సెస్ రోగులు
ఆసుపత్రిల్లో వైద్యులు, రోగుల మధ్య జరిగే సంభాషణను ల్యాప్ టాప్ (అతి చిన్న మైకుల సాయంతో)లో నిక్షిప్తం చేస్తున్నారు. ఆ ప్రక్రియ ముగిసిన అనంతరం క్షణాల్లో ముఖ్యమైన సమాచారంతో వైద్యుల అభిప్రాయం, సిఫారసు చేసిన మందులతో సమ్మరీ తయారవుతుంది.
త్వరలో క్యాథ్ కమిటీ పరిశీలన!
ప్రస్తుతం పైలటు ప్రాజెక్టు కింద ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందిస్తున్న సంస్థలు ఇప్పటివరకు సాధించిన ఫలితాలను త్వరలో క్యాథ్ కమిటీ విశ్లేషిస్తుందని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీరపాండియన్ వెల్లడించారు.
Prajavartha Online Telugu News