విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రబీ సీజన్లో విత్తిన(నాటిన) పంటలను ఇ- క్రాఫ్ లో నమోదు చేసి బయోమెట్రిక్ ధృవీకరణ పూర్తి అయిన ముసాయిదా జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తము రైతు భరోసా కేంద్రాలలో ఈ నెల 3వ తేదీ వరకు ప్రదర్శించడం జరుగుతుందని జిల్లా వ్యవసాయ అధికారిణి ఎస్. నాగమణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రామ సభలు నిర్వహించి జాబితాలోని పేర్లను రైతులకు చదివి వినిపించటం జరుగుతుందన్నారు. పంట నమోదు లో ఎటువంటి తప్పులను రైతులు గమనించిన లిఖిత పూర్వకంగా ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామన్నారు. కనుక ఈ సమయంలోనే రైతులు అప్రమత్తంగా ఉండి జాబితాలను పరిశీలించుకొని ఏవైనా తప్పులు దొర్లినట్లైతే దరఖాస్తు రూపంలో సంబంధిత గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల దృష్టికి తీసుకురావాలని రైతులను కోరుతున్నామన్నారు. నవీకరణ, దిద్దుబాటు చేసిన రికార్డ్స్ ను వీఆర్వో, విఏఏ, విహెచ్ఏ నిర్ధారణ, ఆమోదానికై మండల వ్యవసాయ అధికారికి, తహశీల్దార్ కు పంపడం జరుగుతుందని ఈ ప్రక్రియ ఈ నెల 5వతేది లోపు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఆమోదం పొందిన పిదప రబీ e- క్రాప్ తుది జాబితా ఈ నెల 8వతేదిన అన్ని రైతు భరోసా కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందన్నారు.
ఈ పంట నమోదు చేసుకొని, బయోమెట్రిక్ ధృవీకరణ చేసిన రైతులకు మాత్రమే ప్రకృతి వైపరీత్యాలు, ఇతరత్రా కారణాలవలన జరిగిన పంట నష్టానికి ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం పొందేందుకు వీలుంటుందని వ్యవసాయ అధికారిణి నాగమణమ్మ ఆ ప్రకటనలో తెలిపారు.
Prajavartha Online Telugu News