విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. ఆదివారం నగరపాలక సంస్థ ఎన్నికల విభాగాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో విధుల్లో లేని సూపరిండెంట్ పద్మకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ శనివారం నుండి ఎన్నికల కోడ్ వచ్చినందున ఎన్నికల విధుల్లో ఎంతో అప్రమత్తంగా ఉండాలని, విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎన్నికల నిర్వహణలో కీలకమైన ఎన్నికల విభాగం సూపరిండెంట్ సెక్షన్ లో అందుబాటులో లేకపోవడం, గతంలో ఆదేశించిన విధంగా పోలింగ్ కేంద్రాల వారీగా అందిన క్లైమ్స్ ని ఆర్డర్ లో ఉంచడంలో నిర్లక్ష్యంగా ఉండడం గమనించి షోకాజ్ నోటీసు జారీ చేయాలని మేనేజర్ ని ఆదేశించారు. అలాగే ఎన్నికల నిబందనల మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి రాజకీయ పార్టీల ర్యాలీల్లో, ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకూడదని, ఎక్కడైనా పాల్గొన్నట్లు నిరూపణ అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే నగరంలో వార్డ్ సచివాలయాల్లో ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుల ఫోటోలు, ప్రభుత్వ పధకాల సూచిక బోర్డ్ లు, పోస్టర్స్, ఫ్లేక్సీలు పూర్తి స్థాయిలో తొలగించాలని నోడల్ అధికారులకు, అడ్మిన్ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. నగరంలో ప్రభుత్వ భవనాలు, జంక్షన్ లు, నగరపాలక సంస్థ స్థలాల్లో ఏర్పాటు చేసిన పోస్టర్స్, ఫ్లేక్సీలు, బ్యానర్లను యుద్ద ప్రాతిపదికన తొలగించారని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News