విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ఏపీపీఎస్సీ) ఆధ్వర్యంలో ఈనెల 25వ తేదీన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి వి. శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ లో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఉద్యోగాలకు ఈనెల 25వ తేదీ శనివారం పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలో 1460 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారని ఆన్లైన్విధానంలో నిర్వహించే ఈ పరీక్షకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్ష ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందన్నారు. నగరంలోని కండ్రికలోని ఇయాన్ డిజిటల్ జోన్, ఎస్ఎస్ ఫ్యూచర్ టెక్, వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఎస్ఆర్కె ఇన్స్టూట్ ఆఫ్ టెక్నాలజీ, క్యూ టెక్నాలజీ, ఎస్విటి ఇన్ఫో టెక్తో పాటు తిరువూరులోని శ్రీ వాహిణీ ఇన్స్టూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైలవరంలోని లక్కిరెడ్డి బాలిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పరీక్ష కేంద్రాలలో డిజిటల్ ఆన్లైన్లో పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఆపై ఆలస్యంగా వచ్చిన వారిని గ్రేస్ పిరియడ్లో 8.30 గంటల వరకు అనుమతించడం జరుగుతుందని డిఆర్వో శ్రీనివాసరావు ఆ ప్రకటనలో తెలిపారు.
![](https://prajavartha.com/wp-content/uploads/2024/05/WhatsApp-Image-2024-05-21-at-5.50.12-PM.jpeg)