Breaking News

ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ఫౌండేషన్ ” అవార్డుకు నామినేట్ అయిన “ఏపీసీఎన్ఎఫ్”

-ప్రకృతి వ్యవసాయానికి మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం 2016 వ సంవత్సరం నుంచి అమలు చేస్తున్నఏపీసీఎన్ఎఫ్ (ఆంధ్ర ప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం) కార్యక్రమం 2024 వ సంవత్సరానికి అత్యంత ప్రతిష్టాత్మక “గుల్బెంకియన్ ప్రైజ్ ఫర్ హ్యుమానిటి” అవార్డుకు నామినేట్ అయింది. పోర్చుగీస్ కు చెందిన దాతృత్వ సంస్థ “కలుస్ట్ గుల్బెంకియన్ ఫౌండేషన్” చే 2020 వ సంవత్సరంలో స్థాపించబడ్డ ఈ అవార్డును వాతావరణంలో వస్తోన్న గణనీయమైన మార్పులు, ప్రకృతి విధ్వంసం వంటి అతిపెద్ద మానవాళి సవాళ్లను అధిగమించేందుకుకృషిచేస్తున్న సంస్థలు, వ్యక్తులకు ప్రోత్సాహకంగా ప్రతిఏటా అందిస్తోంది.

గుల్బెంకియన్ ఫౌండేషన్ విజేతలకు 1 మిలియన్ యూరోల నగదు బహుమతిని ప్రకటించడం ద్వారా క్త్లెమేట్ ఎమర్జెన్సీ (వాతావరణ అత్యయిక స్థితి) ని ఎదుర్కొనేందుకు సంస్థలు చేస్తున్న అసాధారణ కృషిని గుర్తించడంతో పాటు వాతావరణ సమస్యల పరిష్కారానికి ఓ ఆశతో పాటు అవకాశాలకు స్పూర్తిని కలిగించింది. జర్మనీ మాజీ ఫెడరల్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ అధ్యక్షతన ఏర్పాటైన స్వతంత్ర జ్యూరీ ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన 181 నామినేషన్ల నుంచి విజేతను ఎంపిక చేస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ఫౌండేషన్ కు నామినేషన్ లు అందాయి.
2020 వ సంవత్సరంలో మొదటి సారి బాగా ప్రసిద్ధి చెందిన ఓ స్వీడిష్ పర్యావరణ కార్యకర్త గ్రేటా థన్‌బెర్గ్ అవార్డు ను సొంతం చేసుకొన్నారు. ఆ తర్వాతసంవత్సరంలో ఐ పి సి సి (Intergovernmental Panel on Climate Change), ఐ పి బి ఈ ఎస్ (the Intergovernmental Science-Policy Platform on Biodiversity and Ecosystem Services) సంస్థలు అవార్డు ను దక్కించుకొన్నాయి.
పోర్చుగల్ లోని లిస్బన్ నగరంలో ఈ నెల 11 వ తేదీ సాయంత్రం 6.45 గంటలకు (భారత కాలమానంలో రాత్రి 11.15 గంటలకు) తుది విజేతను ప్రకటిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు రైతు సాధికార సంస్థ తరపున ఓ ఉన్నత స్థాయి అధికార బృందంతో పాటు ఏపీసీఎన్ఎఫ్ తరపున ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఓ మహిళా రైతు నెట్టెం నాగేంద్రమ్మ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు లిస్బన్ బయలుదేరి వెళ్లారు.
ఏపీసీఎన్ఎఫ్ కార్యక్రమంలో రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా రైతులు భాగస్వాములై 5 లక్షల హెక్టార్లలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయంలో ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా ప్రకృతికి అనుగుణంగా అత్యధిక సంఖ్యలో రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల ఏపీసీఎన్ఎఫ్ ప్రపంచంలోనే ఆగ్రో ఏకాలజీ లో అతి పెద్ద కార్యక్రమంగా గుర్తింపు పొందింది.ప్రకృతి వ్యవసాయం రైతులకు వ్యవసాయ ఖర్చులు తగ్గించి అధిక దిగుబడులు అందించడంతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే గాకుండా పాటు సామాజిక ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతగానో దోహదం చేస్తుంది. APCNF ఇదివరకే 12 రాష్ట్రాలలో ప్రకృతి వ్యవసాయ కార్యక్రమ ఆరంభానికి పునాదులు వేసింది . ఈ ఏడాది దక్షిణ భాగంలోనున్న కొన్ని దేశాలలో కూడా ఆయా దేశాల డిమాండ్ మేరకు కార్యక్రమం మొదలుపెట్టడానికి కృషి జరుగుతోంది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *