ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా అమ్మవారు చిద్రూపిణి. వరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి శ్రీచక్రానికి అధిష్టాన దేవత. త్రిపురత్రయంలో తృతీయ దేవత. ఈరోజున శ్రీ రాజరాజేశ్వరిని ప్రసన్నం చేసుకోవడానికి కుంకుమార్చనలు, సువాసినీ పూజలు, శ్రీచక్రార్చనలు నిర్వహిస్తారు. వాహనాలకు, వ్యవసాయ పనిముట్లకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టి పూలమాలలు అలంకరించి పూజలు చేస్తారు.
శమీ వృక్షానికి పూజలు చేస్తారు. ఈరోజే పాండవులు యుద్ధములో విజయం సాధించారు. అందుచేత విజయదశమినాడు శమీ వృక్షానికి పూజలు, ప్రదక్షిణలు చేస్తారు. శమీ పూజ చేస్తూ చదవాల్సిన శ్లోకం..
శమీ శమయతే పాపం, శమీ శత్రువినాసినీ! అర్జునస్య ధనుర్దారీ, రామస్య ప్రియదర్శినీ!
మన పురాణాల ప్రకారం దేవతలకు పాల సముద్రము నుంచి అమృతభాండము బయటపడినటువంటి రోజునే విజయదశమి రోజుగా చెబుతారు. శ్రేతాయుగంలో రావణాసురుని శ్రీరాముడు సంహరించిన రోజునే విజయదశమిరోజుగా పండుగ చేసుకుంటాము. ద్వాపర యుగంలో శమీ వృక్షానికి పూజ చేసి అజ్ఞాతవాసం తరువాత ఆ శమీ వృక్షం మీద ఉన్న తమ ఆయుధాలను తీసుకుని పాండవులు కౌరవులపై విజయం పొందినటువంటి రోజు విజయదశమి రోజు.
Prajavartha Online Telugu News