– విస్తృతస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
– వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపైనా అవగాహన కల్పించాలి
– డయేరియాకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జులై 1 సోమవారం నుంచి ఆగస్టు 31 వరకు స్టాప్ డయేరియా క్యాంపెయిన్ ద్వారా విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి డయేరియాను సమర్థవంతంగా అడ్డుకోవడంలో వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సృజన.. అధికారులతో కలిసి స్టాప్ డయేరియా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అతిసార వ్యాధి అంటే ఏమి? దీన్ని ఎలా నివారించాలి? ఓఆర్ఎస్, జింక్ ఉపయోగాలు తదితరాలపై అవగాహన కల్పించాలన్నారు. అతిసార వ్యాధి నుంచి చిన్నారులకు రక్షించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళిక ప్రకారం కార్యక్రమాలు చేపట్టాలన్నారు. స్టాప్ డయేరియా కార్యక్రమం ద్వారా ముఖ్యంగా అయిదేళ్లలోపు చిన్నారులపై దృష్టిసారించాలని.. ముందుగానే ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందించి.. అవసరమైనప్పుడు ఓఆర్ఎస్ ద్రావణాన్ని ఏ విధంగా తయారు చేయాలో, ఉపయోగించాలో వివరించాలని సూచించారు. డయేరియా కారణంగా మరణాలు సంభవించకుండా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. ముఖ్యంగా చేతులను సరైన విధంగా శుభ్రపరచుకోవడంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రజలకు అందించే తాగునీరు కలుషితం కాకుండా అప్రమత్తతతో పకడ్బందీ కార్యాచరణను అమలుచేయాలన్నారు. శుభ్రమైన, సురక్షితమైన తాగునీటిని మాత్రమే ఉపయోగించేలా చూడాలన్నారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున ఎక్కడా నీరు నిలిచే పరిస్థితి లేకుండా చూడటంతో పాటు డ్రెయినేజీ వ్యవస్థలు సరైన విధంగా ఉండేలా చూడాలన్నారు. కార్యక్రమాల నిర్వహణలో వైద్య ఆరోగ్యం, ఐసీడీఎస్, గ్రామీణ నీటిసరఫరా తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని.. ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్, జింక్ కార్నర్లను ఏర్పాటు చేయాలని కలెక్టర్ డా. జి.సృజన సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఇ.కిరణ్మయి, డీఎంహెచ్వో డా. ఎం.సుహాసిని, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వరరావు, డీసీహెచ్ఎస్ డా. బీసీకే నాయక్, డీఐవో డా. అమృత, డీఎల్ఏటీవో డా. జె.ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.