– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పోరాట పటిమ ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన అన్నారు. తెలుగు ప్రజల పౌరుషాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహా యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ సృజన… అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూల మాలలు అలంకరించి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ మన్యం ప్రజల్లో అల్లూరి సీతారామరాజు తెచ్చిన చైతన్యం, ప్రజలు స్వేచ్ఛావాయువులు పీల్చుకునేందుకు బ్రిటిష్వారిపై ఆయన చేసిన పోరాటం, త్యాగం ఎప్పటికీ నిలిచి ఉంటాయని.. సమాజానికి ఆయన అందించిన స్ఫూర్తి మార్గంలో నడుస్తూ.. ఆ స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని కలెక్టర్ సృజన పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ బీసీ సంక్షేమ అధికారి ఇ.కిరణ్మయి, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, ఎలక్షన్ సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.