Breaking News

నూతన నేర చట్టాలపై ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వర్క్ షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ న్యాయ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నూతన నేర చట్టాలు దోహదపడతాయని విజయవాడ డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ అథిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ఆధ్వర్యంలో నూతన నేర చట్టాలపై ఏపీఎస్ ఆర్టీసీ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన ఒక రోజు వర్క్ షాప్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అథిరాజ్ సింగ్ రాణా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు నూతన నేర, న్యాయ చట్టాలైన భారతీయ న్యాయ సంహిత , భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం జూలై 1 వ తేదీ నుండి దేశ వ్యాప్తంగా అమలులోకి వచ్చాయన్నారు. ఈ చట్టాల్లో ముఖ్యంగా ఎఫ్ఐఆర్ భౌగోళిక పరిధిని విస్తృతం చేశారని అలాగే ఈ ఎఫ్ ఐ ఆర్ ను మొబైల్ ద్వారా కూడా నమోదు చేయవచ్చన్నారు. బాధితులకు 90 రోజుల్లోపు సత్వర న్యాయం అందేలా ఈ చట్టాలు దోహదపడతాయని తెలిపారు. కొత్త చట్టాల్లో ప్రభుత్వం మహిళలు, చిన్నారులపై నేరాలకు ప్రాధాన్యం ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ ప్రాసిక్యూషన్స్ అదనపు డైరెక్టర్ బి. రామకోటేశ్వరరావు మాట్లాడుతూ, నూతన చట్టాలు దేశంలోని నేర న్యాయ వ్యవస్థకు అత్యంత కీలకమని, చట్టాల ఆవశ్యకత గురించి తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఈ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.సమాచార, ప్రసార మాధ్యమాల ద్వారా, నూతన చట్టాలను ప్రజల్లో మరింత విస్తృతంగా తీసుకువెళ్లి వారికి అవగాహన కల్పించాలని తెలిపారు. అలాగే నూతన చట్టాల్లోని వివిధ సెక్షన్లు, శిక్షలు గురించి ఆయన వివరించారు.
ఈ సందర్భం గా నూతన నేర చట్టాలపై విజయవాడ పత్రికా సమాచార కార్యాలయం- పిఐబి రూపొందించిన సంక్షిప్త సమాచార ప్రత్యేక సంచికను ఆకాశవాణి విజయవాడ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఎమ్. సోమేశ్వరరావు, ఆకాశవాణి ప్రాంతీయ విభాగాధిపతి శ్రీసాయి వెంపాటి తో కలిసి వారు విడుదల చేయడంతో పాటు ఆకాశవాణి సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఆకాశవాణి విజయవాడ డిప్యూటి డైరెక్టర్ జనరల్ ఎమ్. సోమేశ్వరరావు మాట్లాడుతూ ఆకాశవాణి సిబ్బందికి నూతన నేర చట్టాలపై అవగాహనా కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగాధిపతి డా.జి. కొండల రావు, ఆకాశవాణి, దూరదర్శన్ కార్యక్రమం విభాగాధిపతి బి. వెంకటేశ్వర్లు, PIB మీడియా& కమ్యూనికేషన్ అధికారి హెన్రీ రాజ్, గుంటూరు ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ రమేష్ చంద్ర, నెహ్రూ యువ కేంద్రం జిల్లా అధికారి ఎస్. రాము, ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగంలో పనిచేసే 26 జిల్లాల పాత్రికేయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *