-హెల్మెట్ ధారణ-ప్రాణానికి రక్షణ
-హెల్మెట్ ధరించడంపై ర్యాలీ
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం “హెల్మెట్ ధరించడంపై” వన్-కె అవగాహన నడక(ర్యాలీ) జిల్లా కోర్టు ప్రాంగణము నుండి ప్రారంభమై నగర ప్రధాన వీధుల గుండా రేవతి థియేటర్ సెంటర్ వరకు, తిరిగి జిల్లా కోర్టు ప్రాంగణం చేరుకునేలా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విచ్చేసి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. హెల్మెట్ ధరించడం భారం కాదు- “రక్షణ”, హెల్మెట్ ధారణ-ప్రాణానికి రక్షణ అంటూ నినాదాలు చేస్తూ నగర ప్రధాన వీధుల గుండా ర్యాలి సాగింది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని అవగాహన కల్పిస్తూ జిల్లా కోర్టు ఉద్యోగులు, వివిధ సంస్థల లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు పోలీసులు వన్ కె ర్యాలీలో పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.వి రామకృష్ణయ్య, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీస్, రవాణా వివిధ శాఖల అధికారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..