అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖకునూతన సంచాలకులు (డైరెక్టర్)గా బాధ్యతలు చేపట్టిన ఎస్. డిల్లిరావు IAS ఈరోజు అనగా 19-7-24 శుక్రవారం మొదట సారిగా రాష్ట్రంలోని 26 జిల్లాల వ్యవసాయాధికారులు, సహాయ వ్యవసాయ అధికారులు మరియు మండల వ్యవసాయాధికారులతో మంగళగిరి కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాలలో వర్షాలుకురుస్తున్నప్రస్తుత పరిస్థితులలో రాష్ట్రంలోని వాతావరణ పరిస్థితులు, వ్యవసాయసాగు పంటలు, సాధారణ వర్షపాతము, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, పంట కాల్వలలో నీటి లభ్యత తదితర విషయాలపై ఆరా తీసారు.
వర్షాలు ఎక్కువగా కురుస్తున్న నేపధ్యంలో రైతులు నీటి లభ్యతను అంచనా వేసుకుని పంటను, అధిక దిగుబడులనిచ్చే వంగడాలను ఎన్నుకుంటారు, కాబట్టి డిమాండ్ లో ఉన్న అన్ని రకముల వంగడాలు ఏ మేర అందుబాటులో ఉన్నవోసరిచూసుకోవాలన్నారు.సాంకేతిక నైపుణ్యాలను మెరుగు పరచుకుని వ్యవసాయ కార్యక్రమాలను అమలు చేయాలని తెలిపారు. జిల్లాల్లోఆచరణలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలు, సమీకృత వ్యవసాయ ప్రయోగశాలల గురించి ఆరా తీసారు. ప్రతి జిల్లా లో ఆత్మ , ప్రయోగశాలలు, విస్తరణ విభాగంలో ఆమోదించిన పోస్టులు,ఖాళీగా ఉన్న పోస్టుల వివరములు తెలుసుకున్నారు. పిఎం కిసాన్ , సి సి ఆర్ సి కార్డులు, e-పంట జిల్లా స్థాయిలోని విభిన్న సమస్యల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.
జీవ నియంత్రణ ప్రయోగశాలలో జీవసంబంధ ట్రైకోగ్రామా విరిడి, సూడోమోనాస్ ఉత్పత్తిని బాగా పెంచాలని కోరారు. విస్తరణ క్షేత్ర సిబ్బంది వాటిపై ఎక్కువ ప్రచారం చేసి ప్రతి రైతు విధిగా తమ పంటలకు వాడే విధముగా ప్రచారం చేయాలన్నారు. ఎండుతెగులు, విల్ట్ తెగులు తదితర నేలద్వారా వ్యాపించే శిలీంధ్రాలను ఈ జీవ సంబంధిత శిలీంధ్రాలు బాగా నిరోధిస్తాయని తెలియచేసారు.పంట తొలిదశలలో వ్యాపించే రసం పీల్చు పురుగులు, పచ్చపురుగులు తదితర వాటిని ముందుగానే గుర్తించి వాటి నివారణకు రసాయనిక పురుగుమందులను తక్కువగా వినియోగించుకుంటూరైతు స్థాయిలో ఎక్కువ ఫలితాలను ఇస్తున్న స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని(ITK(Indigenous Technical Knowledge) అయినటువంటి కషాయాలు, బీజామృతం, ద్రవజీవామృతం, ఘనజీవామృతం తదితర వాటిని ఉపయోగించాలని తెలిపారు. పిఎం కిసాన్ రికార్డులను క్షేత్ర స్థాయిలో భౌతికంగా తనిఖీ చేసి విచారణలో సరియైన రికార్డులను దృవీకరించి 76% పూర్తి చేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టినందుకు వ్యవసాయ అధికారులందరినీ అభినందించారు.
సమావేశాన్నిముగిస్తూ, వ్యవసాయాధికారులందరూ భూసారపరీక్షలు, నేలఆరోగ్యం, నేల మరియు నీటిసంరక్షణ, నేలల్లో సేంద్రీయ కర్బనం పెంచే యాజమాన్యపద్ధతులపై దృష్టి కేంద్రీకరించాలని తెలిపారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఆలోచనా విధానంలో మార్పులు చేసుకుంటూ సేంద్రీయ సాగు విధానాలపై విస్తృతప్రచారం చేసి ప్రతి రైతు విధిగా తమ పంటలకు వాడే విధంగా కృషి చేయాలన్నారు.