-ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిని పునర్నిర్మాణం చేపట్టి అభివృద్ది చేసే బాధ్యత ఎన్డీయే సర్కారు తీసుకుంటుందని అందుకు బిజెపి ఎమ్మెల్యేలంతా శక్తి వంచన లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబుకు సహకరిస్తామని పశ్చిమ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే యలమంచిలి సుజనా చౌదరి అన్నారు. అసెంబ్లీ సమావేశాల రెండవ రోజైన మంగళవారం శాసనసభలో సుజనా చౌదరి ప్రసంగించారు. ముందుగా అత్యధిక మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపిన విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గడచిన ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. రాజధాని అమరావతిని అణచివేసి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును వైసిపి నాశనం చేసిందని అమరావతి ప్రాంత రైతుల కన్నీళ్ళలో వైసిపి ప్రభుత్వం ఉప్పెనలా కొట్టుకుపోయిందన్నారుఎన్డీయే కూటమి విజయంలో రాజధాని ప్రాంత రైతులు ముఖ్యభూమిక పోషించారన్నారు.జూన్ 4న వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన రోజున స్వాతంత్రం మరోసారి వచ్చిందా అన్నట్టు రాష్ట్ర ప్రజలు పండుగ వాతావరణం లో సంబరాలు చేసుకున్నారని ఇది జగన్ అసమర్ధ పాలనకు నిదర్శనం అని తెలియజేశారు. రాజధాని అమరావతిని ఒక్క అంగుళం కూడా కదల్చుకుండా న్యాయపోరాటం చేసామని గుర్తు చేశారు. బడ్జెట్లో అమరావతికి 15000 కోట్లు మంజూరు చేయడం పోలవరం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని తెలియజేయడం శుభ పరిణామం అన్నారు. యువత ఉపాధి అవకాశాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్ళకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అమరావతిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తామని తెలియజేశారు.