-టెలి, విడియో కాన్ఫరెన్స్ ల విషయంలో సమయ పాలన తప్పనిసరి
-కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 2024 వరదలు మరియు ఇసుక కార్యకలాపాలకు సంబంధించిన ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా క్షేత్ర స్థాయి అధికారులకి అప్పగించిన మార్గదర్శకాలు సకాలంలో పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ పి . ప్రశాంతి స్పష్టం చేశారు. సోమవారం రాత్రి కలెక్టర్ విడిది కార్యాలయ సమావేశ మందిరం లో వరదలు ముంపు నేపధ్యంలో ఎర్రకాలువ, బురద కాలువ, కొవ్వాడ కాలువ, గోదావరి బండ్, రహదారులు మరమ్మత్తులు, ఇరిగేషన్ శాఖల ప్రతిపాదనలు పై కలెక్టరు సమీక్షించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన అనంతరం నష్టాలు అంచనా, పునరావస కార్యక్రమాలు, స్వల్ప, దీర్ఘకాలిక ప్రాతిపాదికన చేపట్టవలసిన వాటిపై సమగ్ర నివేదిక అందజేయాలన్నారు. పంట నష్టం రహదారుల మరమ్మతులు ఇరిగేషన్ కాలువల గట్లు, తదితర అంశాలకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మండల స్థాయిలో ప్రత్యేక బృందాల ద్వారా నివేదికలు రూపొందించాల్సి ఉందన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టే పనులను తక్షణ పూర్తి చేసేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో ఆమోదించాల్సిన పలుకు సంబంధించి సమగ్ర నివేదికను అంచనాలతో కూడి సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వరద ముంపుకు గురైన పంట నష్టాలను అంచనా వేయాలని వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతాంగం వరదలు కారణంగా నష్టం వాటిల్లిన వాటికి ఆయా శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో నియమించిన గణన బృందాలు ద్వారా సమన్వయం చేసుకుంటూ త్వరిత గతిన అందచెయ్యలన్నారు. అత్యవసర పరిస్థితులకి అనుగుణంగా అవసరమైన కార్యకలాపాలు సహాయక చర్యలలో జాప్యాన్ని నివారించేలా సమయ పాలన ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్ అండ్ బి , పంచాయతీ అధికారులు రహదారులకు చేపట్టవలసిన మరమ్మత్తులు , కల్వర్టు లు, ఏటిగట్లు, గోదావరీ బండ్,.తదితర వాటిపై సమగ్ర నివేదిక అందచేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ అసుతోష శ్రీవాత్సవ్, ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ / డిఆర్ఓ జీ .నర్సింహులు, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, ఎస్సి ఇరిగేషన్ జి. శ్రీనివాస రావు, వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, హార్టికల్చర్ అధికారి ఏ .దుర్గేష్, మత్స్య శాఖ అధికారి కె వి కృష్ణారావు, ఆర్ అండ్ బి అధికారి ఎస్ బి వి రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ అధికారి ఎండీ.. అలిముల్లా, తదితరులు పాల్గొన్నారు.