– పాఠశాలల్లో మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మధ్యాహ్న భోజన పథకాన్ని సమర్థవంతంగా అమలుచేసేందుకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు. బుధవారం కలెక్టర్ సృజన మైలవరం మండలంలోని చిలుకూరివారిగూడెం శ్రీ అప్పిడి సుబ్బారెడ్డి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో బోధన ప్రణాళిక నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలుతీరును పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా.. లేదా? అనే విషయాన్ని పరిశీలించారు. ఆహార నాణ్యతను పరిశీలించి విద్యార్థులకు భోజనాన్ని స్వయంగా వడ్డించారు. విద్యార్థులకు టీచింగ్ ప్లాన్ ప్రకారం తరగతులు నిర్వహించడంతో పాటు భవిష్యత్తులో కెరీర్ పరంగా ఉన్నతంగా ఎదిగేందుకు అవసరమైన సహపాఠ్య కార్యక్రమాలపైనా దృష్టిసారించాలని ఆదేశించారు. విద్యార్థులు ప్రతిరోజూ తరగతులకు హాజరయ్యేలా చూసి.. నిర్దేశ బోధన ప్రణాళికకుఅనుగుణంగా విద్యా నైపుణ్యాలు అందించేందుకు కృషిచేయాలన్నారు. భవిష్యత్తు కెరీర్ పరంగా ఉన్న అవకాశాలు, వాటిని అందుకునేందుకు అనుసరించాల్సిన మార్గాలపైనా వివరించాలన్నారు. కిచెన్ గార్డెన్ అభివృద్ధిపైనా దృష్టిసారించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాలల్లో ఇంకా అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి కృషిచేయనున్నట్లు కలెక్టర్ సృజన తెలిపారు.