Breaking News

పరిశ్రమల శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

-5 నూతన పాలసీలు రూపకల్పనకు ఆదేశం
-4 ప్రాంతాల్లో కొత్త ఇండస్ట్రియల్ క్లష్టర్లు
-పారిశ్రామిక ప్రోత్సాహకాలపై సానుకూల నిర్ణయం
-గతంలో ఒప్పందం చేసుకుని వైసీపీ హయాంలో వెనక్కి వెళ్లిన పారిశ్రామికవేత్తలతో సంప్రదింపులు
-మల్లవల్లి పారిశ్రామికవాడలో భూముల ధరల తగ్గింపు పై సమీక్ష
-పరిశ్రమల శాఖ అధికారులతో సిఎం చంద్రబాబు నాయుడు సమీక్ష

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, తీసుకురావాల్సిన కొత్త పాలసీలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. గత పదేళ్ల కాలంలో పెట్టుబడుల కోసం వివిధ సందర్భాల్లో చేసుకున్న ఒప్పందాలు, వాటి ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వం గతంలో అధికారంలో ఉన్న సమయంలో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులపై ఒప్పందాలు చేసుకోగా…తరువాత వచ్చిన ప్రభుత్వం అనుసరించిన విధానాల కారణంగా పారిశ్రామిక వేత్తలు వెనక్కి వెళ్లిపోయారని సీఎం అన్నారు. పారిశ్రామిక వేత్తలను ఇబ్బందులు పెట్టడం, రాజకీయ వేధింపులకు గురిచేయడంతో చాలా కంపెనీలు పెట్టుబడుల ఒప్పందాలను రద్దు చేసుకున్నాయని…కొత్త కంపెనీలు కూడా రాలేదని సీఎం అన్నారు. మళ్లీ పారిశ్రామిక వేత్తల్లో నమ్మకం కల్పించాల్సిన అసవరం ఉందన్నారు. పారిశ్రామిక అవసరాల కోసం తీసుకున్న భూములను కూడా ఇతర అవసరాలకు వినియోగించారని సీఎంకు అధికారులు వివరించారు. వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల కోసం సేకరించిన భూముల్లో 1,382 ఎకరాలను ఇళ్ల పట్టాల కోసం అంటూ తీసుకున్నారని అధికారులు తెలిపారు. పేదలకు ఇళ్లు ఇచ్చేందుకు అసవరమైన స్థలం సేకరించి ఇవ్వాల్సి ఉన్నా…పరిశ్రమలకు ఇచ్చే స్థలాలు ఇచ్చారని వివరించారు. పరిశ్రమలకు ప్రోత్సాహకాల కోసం గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 66 శాతం ప్రోత్సాహకాలు చెల్లిస్తే….వైసీపీ ప్రభుత్వంలో 34 శాతం మాత్రమే ఇచ్చారని అధికారులు వివరించారు. దీనిపై సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిద్దామన్నారు. తద్వారా పెట్టుబడులకు ఆస్కారం ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
2014 -2019 కాలంలో 64 ఇండస్ట్రియల్ పార్కుల ద్వారా 14,125 ఎకరాలు అందుబాటులోకి తెస్తే….2019 -2024 మధ్య కేవలం 31 పార్కులు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. ఇలాంటి పరిణామాలతో పారిశ్రమిక వేత్తలు, పెట్టుబడి దారులు నమ్మకం కోల్పోయారని సీఎం అన్నారు. నాడు ఒప్పందం చేసుకుని వైసీపీ ప్రభుత్వ విధానాలతో వెనక్కి వెళ్లిన వారితో మళ్లీ సంప్రదింపులు జరపాలని, అవసరం అయితే తాను కూడా వారితో మాట్లాడుతానని ముఖ్యమంత్రి అన్నారు. ఇప్పటికే పనులు ప్రారంభించిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం అన్నారు. తద్వారా ఏడాది కాలంలో లక్ష కోట్ల పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులు పూర్తి చేసి 1,36,260 మందికి ఉపాది కల్పించాలని అన్నారు. ఉమ్మడి కృష్ణాజిల్లా మల్లవల్లి పారిశ్రామిక వాడలో భూముల రేట్లు తగ్గించి…పెట్టుబడులకు ఊతం ఇవ్వాలని సీఎం అదేశించారు. వైసీపీ ప్రభుత్వం దీన్ని పూర్తిగా వివాదాల్లోకి నెట్టేసి…నిర్వీర్యం చేసిందని సీఎం అన్నారు.

5 నూతన పాలసీలు
వచ్చే 100 రోజుల్లో కొత్తగా 5 పాలసీలు తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. నూతన ఇండస్ట్రీయల్ పాలసీ, ఎంఎస్ఎంఇ పాలసీ, ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఎలక్ట్రానిక్, ఐటీ అండ్ క్లౌడ్ పాలసీ, టెక్స్ టైల్ పాలసీలు తీసుకురావాలని అన్నారు. అత్యుత్తమ పాలసీల ద్వారా పెట్టుబడుల ఆకర్షణకు అనువైన వాతారవణం కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎనర్జీ హబ్ గా చెయ్యాలనే లక్ష్యంతో పాలసీలు రూపొందించాలని అన్నారు. అదే విధంగా కొత్తగా నాలుగు పారిశ్రామిక క్లష్టర్లపై ప్రతిపాదనలు సిద్ధం చేసి కేంద్ర అనుమతులు పొందాలని సీఎం అన్నారు. కుప్పం, మూలపేట, చిలమత్తూరు, దొనకొండ లేదా పామూరులో కొత్త క్లష్టర్స్ ఏర్పాటు చేయాలని..ఈ మేరకు ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆయా క్లష్టర్లలో ఎలక్ట్రానిక్స్, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, హార్డ్ వేర్ సంస్థల ఏర్పాటుకు కృషి చేయాలని సిఎం అన్నారు. అలాగే కృష్ణపట్నం, నక్కపల్లి, ఒర్వకల్లు, కొప్పర్తి నోడ్స్ ప్రోగ్రస్ పై చర్చించారు. నక్కపల్లిలో రూ.11,542 కోట్లతో ఏర్పాటు చేసే బల్క్ డ్రగ్ పార్క్, రూ. 60 వేల కోట్లతో ఏర్పాటు అయ్యే NTPC గ్రీన్ హైడ్రొజన్ హబ్, ప్రస్తుతం చర్చలు జరుపుతున్న బిపిసిఎల్ ప్రాజెక్టుల స్థితిగతులపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్షించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *