-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ను అన్నిరంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అగ్రగామిగా నిలపడానికి కృషి చేస్తున్నారని నందిగామ స్థానిక ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ఆదివారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమికి ప్రజలు అఖండ మెజార్టీ ఇచ్చారని గుర్తుచేశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.15 వేల కోట్లు ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని వెల్లడించారు. పోలవరం పూర్తయితే, 7,20,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని వివరించారు. దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ ఇదని చెప్పారు. 960 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరెంట్ యూనిట్ 10 నుంచి 15 పైసలకే తయారు చేయొచ్చని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందని చెప్పారు. కూటమి ప్రభుత్వం సమర్ధంగా సరిచేసి, పాలనను గాడిలో పెట్టి, సుపరిపాలన అందించే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పేర్కొన్నారు.