Breaking News

అచ్యుతాపురం సెజ్ బాధితులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరామర్శ..

-విశాఖలోని మెడికవర్ ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం చంద్రబాబు
-ఫార్మా ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు..
-ధైర్యంగా ఉండాలని.. ప్రభుత్వం అన్ని చూసుకుంటుందని బాధితులకు సీఎం భరోసా..
-బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన..
-ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం..
-తీవ్ర గాయాలైన వారికి రూ.50 లక్షలు, స్వల్ప గాయాలైన వారికి రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఏమన్నారంటే.. నిన్న ఫార్మాసిటీలో జరిగింది ఒక దురదృష్టకరమైన సంఘటన. దీనిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, బాధపడుతున్నా. ఈరోజు ఈ సంఘటన నాకు చాలా బాధేసింది. మనసును కూడా కలచివేసింది. ఈ ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గడిచిన ప్రభుత్వం వ్యవస్థలను సర్వనాశనం చేశారు. అవన్నీ బాగుచేసే కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధేస్తోంది. ఈ సంఘటన వల్ల 17 మంది చనిపోయారు. 36 మంది గాయపడ్డారు. వీరిలో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. 26 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్ధితిని వైద్యుల నుంచి తెలుసుకున్నాను. ప్రమాదంలో గాయపడిన అందరినీ కలిసి వారితో మాట్లాడాను. వారితో ఒకటే చెప్పాను.. ధైర్యంగా ఉండాలని బాధితులకు భరోసా ఇచ్చాం. ఎన్నిరోజులైనా పర్వాలేదు ప్రభుత్వం అన్నీ చూసుకుంటుందని చెప్పాం. వీరిలో ఒకరికి 57 శాతం కాలిన గాయాలయ్యాయి. అతనితో కూడా మాట్లాడాను చాలా ధైర్యంగా ఉన్నాడు. మరొకరికి 24 శాతం, ఇంకొకరికి 12 శాతం, మరొకరికి 10 శాతం కాలిన గాయాలయ్యాయి. ఒకరు ప్రమాదం జరిగిన షాక్ లో ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నారు. బాగానే ఉన్నారు. డాక్టర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చాం.. ఎట్టిపరిస్థితుల్లో వైద్యం విషయంలో రాజీపడొద్దని చెప్పాం. అన్నివిధాల మానిటరింగ్ చేస్తున్నాం. ఏదేమైనా ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన. చనిపోయినవారికి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఇస్తున్నాం. అదేవిధంగా తీవ్రంగా గాయపడినవారికి రూ.50 లక్షలు, స్వల్పగాయాలైన వారికి రూ.25 లక్షలు ఇస్తున్నాం. ఏమాత్రం కూడా ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా అన్నివిధాల ఆదుకునే బాధ్యతను మేము తీసుకుంటాం. విశాఖపట్నం నాకు మనస్సుకు దగ్గరైన సిటీ. హుదూద్ సమయంలో మేం ఏవిధంగా చేశామో అందరూ చూశారు. ఇలాంటి సిటీ విషయంలో సేఫ్టీ మెజర్స్ అంతా ప్రక్షాళన చేయాలి. భవిష్యత్‌లో ఎలాంటి సంఘటన జరగకూడదని ఆలోచించే సమయంలో ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన జరిగింది. దీన్ని ఇదే చివరిది కావాలని నేను కోరుకుంటున్నా. బాధితులను చూశాక, వారి ధైర్యం చూశాక వెంటనే కోలుకుంటారనే ఆశాభావం నాకు కలిగింది. మీడియా కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలకు, కుటుంబసభ్యులకు అండగా ఉన్నామనే ధైర్యం కలిగించాలి. మళ్లీ వారిని మామూలు వ్యక్తులుగా తయారు చేయాలి. మేనేజ్‌మెంట్‌లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *