– క్రీడాంశాలతో పాటు క్విజ్, వ్యాసరచన తదితర విభాగాల్లోనూ పోటీలు
– జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల 29వ తేదీన మేజర్ ధ్యాన్చంద్ జన్మదినం సందర్భంగా నిర్వహించే జాతీయ క్రీడాదినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ, జిల్లా కలెక్టర్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 26 నుంచి 31వ తేదీ వరకు క్రీడలతో పాటు క్విజ్, వాసరచన తదతర అంశాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ది అధికారి ఎస్ఏ అజీజ్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారమిక్కడ ఓ ప్రకటన విడుదల చేశారు.
పోటీలను పాఠశాలలు, కళాశాలలతో పాటు జిల్లాస్థాయిలో ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. వాక్/రేస్, వాలీబాల్, హాకీ, మినీ ఫుట్బాల్, బాస్కెట్ బాల్, బ్యాడ్మింటన్, చెస్, బాక్సింగ్, జూడో, వెయిట్ లిఫ్టింగ్ తదితర విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు.
పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేయడంతో పాటు వివిధ వేదికలపై ప్రతిభచూపిన క్రీడాకారులను ఐజీఎం స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని క్రీడాకారులు, విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పోటీల్లో పాల్గొనేందుకు అర్హతలు, ఇతర వివరాలకు 9494481669 ఫోన్ నంబర్లో సంప్రదించొచ్చని ఎస్ఏ అజీజ్ తెలిపారు.