-వైద్య ఆరోగ్యశాఖ కమీషనర్ పిలుపు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
మనిషి మరణానంతరం తన నేత్రదానంతో మరికొందరికి చూపు రప్పించవచ్చని ప్రజారోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమీషనర్, జాతీయ హెల్త్ మిషన్ డైరెక్టర్ పిలుపునిచ్చారు. ఈ నెల 25వ తేదీ నుండి సెప్టెంబర్ 8వ తేదీ వరకూ నిర్వహిస్తున్న జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ప్రచార పోస్టర్, కరపత్రాన్ని ఆయన సోమవారం మంగళగిరి ఎపిఐఐసి భవన సముదాయంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో దాదాపు 1,312 మిలియన్ల మంది ప్రజలు నల్లగుడ్డు దెబ్బతినటం వల్ల అంధత్వంతో బాధపడుతున్నారని చెప్పారు. వారికి నల్లగుడ్డు మార్పిడి శస్త్ర చికిత్స ద్వారా తిరిగి చూపు తెప్పించవచ్చన్నారు. అందువల్ల అందరూ నేత్రదానం చేసేందుకు అంగీకారం తెలియచేయాలని ఆయన కోరారు. ప్రస్తుతం సంవత్సరానికి కేవలం 60 వేల నుండి 70 వేల వరకూ మాత్రమే కార్నియా (నల్లగుడ్ల)ను సేకరిస్తున్నామని ఆయన వివరించారు. మరణానంతరం మనం చేయగలిగింది ఒక్క నేత్రదానమేనని, కావున అందరూ ముందుకు వచ్చి నేత్రదానానికి అంగీకార పత్రాలు అందచేయాలని ఆయన సూచించారు. నేత్రదాన పక్షోత్సవాల సందర్భంగా రాష్ట్రంలో ర్యాలీలు, సమావేశాలు, విద్యార్ధులతో క్విజ్ కాంపిటీషన్ల వంటి వాటిని నిర్వహించి ప్రజల్లో నేత్రదాన ఆవశ్యకతపై అవగాహన పెంపొందించాలని ఆయన ఎన్ పిసిబి జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ ను ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో అడిషనల్ డైరెక్టర్లు, జాయింట్ డైరెక్టర్లు, ప్రోగ్రాం ఆఫీసర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.