-వైసీపీ నగర అధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలపై టీటీడీ ఆంక్షలు విధించడం ఎంతమాత్రం సరికాదని విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఒక భక్తుడికి రెండు మాత్రమే లడ్డూలు ఇచ్చేలా రూల్స్ మార్చడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ నూతన విధానాలపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు. ఎప్పటికప్పుడు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల తిరుపతి దేవస్థానం సామర్థ్యం పెంచుకుంటూ పోవాల్సిందిపోయి.. ప్రసాదంపై ఆంక్షలు విధించడం సరైన విధానం కాదన్నారు. ఆ కలియుగ దైవాన్ని దర్శించుకున్న భక్తులు స్వామి వారి లడ్డూ ప్రసాదాన్ని అత్యంత ప్రియంగా స్వీకరిస్తారని.. ఇప్పటి వరకూ డబ్బులు చెల్లిస్తే ఒక్కొక్కరికి ఎన్ని లడ్డూలైనా ఇచ్చేవారన్నారు. కానీ టీటీడీ కొత్త నిర్ణయం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసిందని.. ముఖ్యంగా దళారీ వ్యవస్థను పెంచిపోషించేలా ఉందని అభిప్రాయపడ్డారు. తక్షణమే లడ్డూ విక్షయాలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు.