పెనమలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కృష్ణాజిల్లాలో వరద నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల ప్రత్యేక బృందం బుధవారం కృష్ణాజిల్లాలో పెనమలూరు నియోజకవర్గంలో పెనమలూరు మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వరద నష్టం పరిశీలించింది. తొలుత పెనమలూరు మండలంలోని ఎనమలకుదురు నుండి బయలుదేరి పెదపులిపాక వస్తు దారిలో దెబ్బతిన్న వరి పంటలను కేంద్ర బృందం పరిశీలించింది. పెదపులిపాకలో దెబ్బతిన్న మొక్కజొన్న పంటను, వరదలకు నీట మునిగిన ఇళ్ళు, సమగ్ర రక్షిత మంచినీటి పథకం ట్రాన్స్ఫార్మర్ పరిశీలించారు. చోడవరంలో బొప్పాయి అరటి కంద వంటి దెబ్బతిన్న పంటలు పరిశీలించారు. అనంతరం మద్దూరు లో రైతు సంఘం నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి రైతులకు జరిగిన పంట నష్టం వివరించారు. పెనమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్ కేంద్ర బృందంతో వరద నష్టం తెలియజేశారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు మద్దూరులో కేంద్ర బృందాన్ని కలిసి పంట నష్టం వివరించి రైతులను ఆదుకోవాలని వినతిపత్రం అందజేశారు. కేంద్ర బృందం వెంట జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించి నష్టం వివరాలను కేంద్ర బృందానికి తెలియజేస్తున్నారు. బృందం వెంట వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు కూడా ఉన్నారు.
కేంద్ర బృందంలో
1)అనిల్ సుబ్రమణియం, సంయుక్త కార్యదర్శి, (IS-I & CS), కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, నాయకత్వంలో
2)రాకేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్, కేంద్ర రోడ్డు రవాణా, హైవేస్ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం, విజయవాడ.
3)డాక్టర్. ఎస్ వి ఎస్ పి శర్మ, సైంటిస్ట్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్, ఇస్రో, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, హైదరాబాద్ సభ్యులుగా ఉన్నారు.