– ఎవరైనా మిగిలి ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
– ఈనెల 12న సచివాలయంలో సంప్రదిస్తే
ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి వారి నష్టాన్నీ నమోదుచేస్తాం
– ప్రజలను బాధనుంచి గట్టెక్కించేందుకు అన్ని విధాలా సహాయసహకారాలు
– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ, పరిసర వరద ప్రభావిత ప్రాంతాల్లో గృహాలకు, వ్యాపార వాణిజ్య ఆస్తులకు జరిగిన నష్టాన్ని యాప్లో నమోదుచేసే ప్రక్రియ అర్బన్ ఏరియాలో దాదాపు పూర్తికావొచ్చిందని, గ్రామీణ ప్రాంతంలోనూ శరవేగంగా జరుగుతోందని.. అయితే ఇంకా ఎవరైనా మిగిలిఉంటే వారు ఈ నెల 12న తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాన్ని సంప్రదిస్తే ఎన్యూమరేషన్ బృందాన్ని పంపి, నష్ట నమోదు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన తెలిపారు.
కలెక్టర్ సృజన బుధవారం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడుతూ వరద ప్రభావంపడిన 32 వార్డులు, అయిదు గ్రామాల్లో రక్షణ, ఉపశమన చర్యలు విజయవంతంగా చేయడం జరిగిందని.. ఇప్పుడు పునరావాస చర్యలను ప్రణాళికాయుతంగా చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ నెల 9వ తేదీన నష్ట నమోదు ప్రక్రియ ప్రారంభించామని, బాధితులను ముంపు నష్టాల నుంచి బయటపడేసేందుకు గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా కృషిచేస్తున్నట్లు తెలిపారు. దాదాపు 2,32,000 కుటుంబాలకు సంబంధించిన నష్ట గణాంకాలను నమోదు చేయడం జరుగుతోందని.. ఒకవేళ ఇల్లు విడిచి బయటికి వెళ్లినా, ఎన్యూమరేషన్ బృందం ఇంటికి వచ్చినప్పుడు అందుబాటులో లేకున్నా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఈ నెల 12వ తేదీన తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ కార్యదర్శిని సంప్రదించాలని సూచించారు. నష్ట గణనకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా టోల్ ఫ్రీ నెంబర్లలో సబ్ కలెక్టర్ కార్యాలయం (0866 2574454), విజయవాడ మున్సిపల్ కార్యాలయం (8181960909) సంప్రదించి ఎన్యూమరేషన్ను పూర్తిచేయించుకోవచ్చని వివరించారు. నందిగామ, జగ్గయ్యపేట, తిరూవూరు తదితర ప్రాంతాల్లోనూ ఎన్యూమరేషన్కు బుధవారం మధ్యాహ్నం యాప్ అందుబాటులోకి వచ్చిందని.. ఈ ప్రాంతాల్లోనూ నష్టగణనను మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తిచేస్తామని కలెక్టర్ సృజన తెలిపారు.
అన్ని విధాలా అండగా నిలిచేందుకు కృషి:
రిలీఫ్ అంటే కేవలం ఆహారం, ఆర్థిక సహకారమే కాకుండా బాధితులకు ఎన్ని విధాలా సహాయం అందించాలో అన్ని విధాలా సహాయసహకారాలు అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని.. ప్రజలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాధితులకు చేసే సహాయం రియాక్టివ్గా కాకుండా ప్రో యాక్టివ్గా (క్రియాశీలంగా) ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నిర్దేశించారని.. ఈ క్రమంలోనే బాధితుల వాహనాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఎలక్ట్రికల్ రిపేర్లు వంటివి చాలా తక్కువ ధరలో చేయించడం జరుగుతోందని.. అవసరమైతే ప్రభుత్వమే రాయితీతో ఇవన్నీ చేయించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాధితుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచిన అవకాశాలను సద్వినియోగం చేసుకొని అందరూ సమష్టిగా విజయవాడను పూర్వ స్థితికి తీసుకొచ్చేందుకు కృషిచేద్దామని కలెక్టర్ సృజన పిలుపునిచ్చారు.