– విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు
– ఈ నెల 20వ తేదీ నుంచి వరద ప్రభావిత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
– ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ప్రత్యేకంగా విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో బ్యాకింగ్ ఫెసిలిటేషన్ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నెల 20వ తేదీ శుక్రవారం నుంచి ఈ కేంద్రం ద్వారా సేవలు పొందొచ్చని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణం నుంచి ఫెసిలిటేషన్ కేంద్రం సేవలందిస్తుందని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బ్యాంకింగ్ సేవలు పొందేందుకు, అక్కడికక్కడే దరఖాస్తుల పరిష్కారంతో పాటు సమర్థవంతమైన ఫాలో-అప్ కోసం ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. వివిధ బ్యాంకుల ప్రతినిధులు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటారని.. రుణాల రీషెడ్యూల్, వినియోగ రుణాలు, మూలధన రుణాలు వంటి సేవలు వీరిద్వారా పొందొచ్చని వివరించారు. ఎవరూ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు ప్రక్రియతో పాటు సేవలు పొందే ప్రక్రియను సులభతరం చేసేందుకు లీడ్ బ్యాంక్ యూబీఐ భాగస్వామ్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముంపు బాధితులు తమ పరిధిలోని బ్యాంకులు లేదా ప్రత్యేక ఫెసిలిటేషన్ కేంద్రం ద్వారా సేవలు పొందొచ్చని కలెక్టర్ సృజన తెలిపారు.