-సమీక్షలో పాల్గొన్న స్పెషల్ సీఎస్, ముగ్గురు సీఎండీలు
-వంద రోజుల్లో 12 వేల కొత్త వ్యవసాయ కనెక్షన్లు
-పారిశ్రామిక, డొమెస్టిక్ అవసరాలకు నిరంతర విద్యుత్
-త్వరలోనే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
వంద రోజుల పాలనపై విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చేపట్టిన కార్యక్రమాలు వాటి అమలుపై ఆరా తీశారు. ప్రత్యేకించి కొత్త వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడంపై మంత్రి అడిగి తెలుసుకున్నారు. మొత్తం 40 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం లక్ష్యంగా అధికారులు పని చేయాలి సూచించారు. అయితే ప్రభుత్వం ఏర్పాటు అయిన నుంచి ఇప్పటి వరకు సుమారు 12 వేల వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చినట్లు అధికారులు మంత్రికి వివరించారు. అత్యధికంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 5 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీ-సేవా, అధికారుల చుట్టూ తిరగకుండా 1912 టోల్ ఫ్రీ నంబర్ కు కాల్ చేసి కనెక్షన్ బుక్ చేసుకునే విధానాన్ని తీసుకుని రావడంతో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అధికారులు తెలిపారు. టోల్ ఫ్రీ విధానం ద్వారా జవాబుదారీతనం పెరిగిందని వివరించారు. పీపీపీ పద్ధతిలో విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్లు నిర్మించేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారు చేసినట్లు చెప్పారు.
మరో వైపు ఆర్డీఎస్ఎస్ ప్రాజెక్ట్ పనులు అమలుపై మంత్రి ఆరా తీశారు. అంతేగాకుండా మినీ, మెగా సోలార్ పార్కుల ఏర్పాటు పనులు గురించి అడిగి తెలుసుకున్నారు. సోలార్ పార్కుల ఏర్పాటుతో ఉద్యోగ కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. త్వరలోనే ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ 2024ను తీసుకురానున్నట్లు చెప్పారు. ఈ సమీక్షలో ఎనర్జీ స్పెషల్ సీఎస్ కే విజయానంద్, డిస్కంల సీఎండీలు ఇతర అధికారులు పాల్గొన్నారు.