-పందెంలో పాల్గొన్నా చట్టరీత్యా నేరమే
-నిబంధనల అమలుకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలు
-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కోడి పందాలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని… ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో కోడి పందాలు జరక్కుండా తీసుకుంటున్న చర్యలపై సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీశ సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ కోడి పందాల నిషేధంపై రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్-1974 సెక్షన్-10, జంతుహింస నివారణ చట్టం-1960 సెక్షన్ 34 ప్రకారం కోడి పందాలను నిషేధించడం జరిగిందన్నారు. ఈ చట్టాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కోడి పందాలను నివారించేందుకు హైకోర్టు మార్గదర్శకాల మేరకు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో సంయుక్త తనిఖీల బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. గ్రామస్థాయి బృందంలో వీఆర్వో, పోలీస్ కానిస్టేబుల్, పశుసంవర్థక శాఖ సిబ్బంది ఉంటారని.. మండలస్థాయి బృందంలో తహసీల్దార్, ఎస్హెచ్వో, మండల పశుసంవర్థక అధికారి ఉంటారన్నారు. అదేవిధంగా జిల్లాస్థాయి బృందంలో ఆర్డీవో/సబ్ కలెక్టర్, డీఎస్పీ/ఏసీపీ, పశుసంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్ సభ్యులుగా ఉంటారని వివరించారు. ఈ బృందాలు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, చట్టాల్లోని అంశాలను వివరించాలన్నారు. పందెం నిర్వహించినా, పాల్గొన్నా చట్ట ప్రకారం నేరమేనని పేర్కొన్నారు. ఎక్కడా పందెం బరులు ఏర్పాటుకాకుండా క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని.. నిబంధనల మేరకు తహసీల్దార్లు, ఆర్డీవోలు వారి పరిధిలోని పంచాయతీలకు నోటిఫికేషన్లు జారీచేయాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి పందాలు జరక్కుండా గట్టి నిఘా ఏర్పాటుచేసి, తనిఖీలను ముమ్మరం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు.
ఈ నెల 14 నుంచి 31 వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు:
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ నుంచి 31 వరకు జంతు సంక్షేమ పక్షోత్సవాలు జరగనున్నాయని కలెక్టర్ లక్ష్మీశ వెల్లడించారు. పశుసంవర్థక శాఖ.. జంతు సంరక్షణ సంఘాలు, రెవెన్యూ, విద్య, పంచాయతీరాజ్, మునిసిపల్ తదితర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ పక్షోత్సవాలు నిర్వహించాలని సూచించారు. పక్షోత్సవాల సందర్భంగా చర్చలు, నిపుణులతో ఇంటర్వ్యూలు, విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ తదితర పోటీలు నిర్వహించి, విజేతలకు సర్టిఫికేట్లు, బహుమతులు అందించనున్నట్లు తెలిపారు. జంతు సంక్షేమ చట్టాలు, నిబంధనలు తదితరాలపై అవగహన కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో కైండ్నెస్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరుగుతోందని.. అధికారులు, సిబ్బంది కీలకభాగస్వామ్యంతో పక్షోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు.
సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జిల్లా పశుసంవర్థక అధికారి ఎం.హనుమంతరావు, జెడ్పీ సీఈవో కె.కన్నమనాయుడు, డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు, డీపీవో పి.లావణ్య కుమారి, గ్రామ, వార్డు సచివాలయాల ప్రత్యేక అధికారి పి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News