ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఏలూరు నగరంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దే ప్రణాళికలు అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు.
మంగళవారం స్థానిక కలెక్టర్ కార్యాలయం లో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ను స్థానిక నాయకులు ఎస్.ఏమ్.ఆర్.పెదబాబు తో కలిసి మేయర్ షేక్ నూర్జహాన్ , గోపాలపురం శాసన సభ్యులు తలారి వెంకట్రావు లు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఈ సందర్భంగా ఏలూరు నగరాభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు రూపొందించి రావాలని, వాటిని మరింత సమర్ధవంతంగా చేపట్టే దిశలో తన సహకారం ఎప్పుడు ఉంటుందని తెలిపారు. వ్యర్ధాలు నుంచి సంపద సృష్టించేందుకు, మొక్కలు పెంపకాన్ని చేపట్టి నగరాన్ని సుందరంగా తీర్చేందుకు అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నగరంలో నుంచి ప్రవహించే ఏలూరు కాలువ గట్లు వెంబడి సుందరంగా తీర్చిదిద్దే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.
ఏలూరు నగరాభివృద్ధికి తమ విలువైన సూచనలు, సలహాలను అందించాలని ఏలూరు నగర కార్పొరేషన్ మేయర్ నూర్జహాన్ పేర్కొన్నారు. విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ గా సుదూర కాలం పనిచేసిన అనుభవాన్ని ఏలూరు నగర అభివృద్ధి చెందిన కార్యక్రమాలు చేపట్టే దిశగా సహకారాన్ని కోరుతున్నామని పేర్కొన్నారు. దేశంలోనే విజయవాడకి ప్రత్యేక స్థానం తీసుకుని రావడంలో మీ పోషించిన పాత్ర పలువురికి ఆదర్శంగా నిలిచిందనడంలో సందేహం లేదని అన్నారు.
శాసన సభ్యులు తలారి వెంకట్రావు మాట్లాడుతూ, పశ్చిమగోదావరి జిల్లా ను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు తమ విలువైన సమయాన్ని వెచ్చించాలన్నారు.