-కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో నెల్లూరు కేంద్రంగా కార్యకలాపాలు
-భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియా అధికారిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న సూరి
న్యూఢిల్లీ మరియు నెల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం), నెల్లూరు క్షేత్ర కార్యాలయ ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ (క్షేత్ర ప్రచార అధికారి)గా పరవస్తు నాగసాయి సూరిని నియమిస్తూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం న్యూఢిల్లీలో ఉపరాష్ట్రపతి కార్యాలయ సమాచార విభాగంలో మీడియా అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సూరి, ఈనెల 11న నెల్లూరు, ప్రకాశం జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్, గ్రూప్ -బి 2017 బ్యాచ్ కు చెందిన పరవస్తు నాగసాయి సూరి, గతంలో గుంటూరు-కృష్ణా జిల్లాల క్షేత్ర ప్రచార అధికారిగానూ, భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు మీడియా అధికారిగానూ బాధ్యతలు నిర్వహించారు.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం) గురించి :
భారత ప్రభుత్వ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పి.ఐ.బి), సెంట్రల్ బ్యూరో ఆప్ కమ్యూనికేషన్ (సి.బి.సి), పబ్లికేషన్ డివిజన్, పత్రికల రిజిస్ట్రార్ కార్యాలయం, ఫిల్మ్ డివిజన్, ప్రసార్ భారతి (ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్), న్యూమీడియా వింగ్ తదితర కార్యాలయాలు పని చేస్తున్నాయి.
ప్రతి రాష్ట్రంలోనూ, ప్రతి రెండు జిల్లాలకు కలిపి ఓ సెంట్రల్ బ్యూరో ఆప్ కమ్యూనికేషన్ (కేంద్ర సమాచార విభాగం) ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, నెల్లూరు, కడప, కర్నూలు లో ఈ కార్యాలయాలు ఉన్నాయి. క్షేత్రస్థాయిలో అంటే మండల కేంద్రాల్లో, గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రచారం చేసే బాధ్యతను ఈ కార్యాలయాలు నిర్వర్తిస్తుంటాయి. ప్రచార చిత్రాల ప్రసారం ద్వారా, సమావేశాలు, ఎగ్జిబిషన్లు తదితర మార్గాల్లో గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వ పథకాల వివరాలను చేరవేస్తుంటారు.