-తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డి
మంగళగిరి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రం కాని రాష్ట్రం ముంబయ్లో కరోనా సమయంలో తెలుగు వారికి ఆపద్భాంధవుడిగా ముంబయ్లో ఆహారం, వసతి, ప్రయాణం వంటి అత్యవసర సేవలను అందించిన మానవతావాది మాదిరెడ్డి కొండారెడ్డి. ఇటువంటి వ్యక్తుల సేవలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ఉగాది సందర్భంగా అందించే పురస్కారాలలో అత్యంత ప్రభావవంతమైన సేవా రంగంలో మాదిరెడ్డి కొండారెడ్డికి గుర్తింపు కల్పించింది. ఈ సందర్భంగా మాదిరెడ్డి కొండారెడ్డి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన తన అనుభూతులను మీడియాతో పంచుకున్నారు. తెలుగు మరియు సంస్క్రత అకాడమి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లాలోని నాగార్జున యూనివర్శిటీలో మంగళవారంనాడు జరిగిన ఉగాది పురస్కరాలు-2023 ప్రధానం కార్యక్రమంలో భాగంగా విద్య, వైద్యం, లలిత కళలు, జానపద, నాటక రంగం, వ్యవసాయ రంగం, సేవా రంగం, ప్రత్యేక కేటగిరి (చిత్రకళ) రంగాలకు చెందిన ఏడుగురికి రాష్ట్రం హోంమంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ఉగాది పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా వారికి శాలువా కప్పి, జ్ఞాపికను అందజేసి నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. సేవా రంగానికి సంబంధించి ముంబయ్కి చెందిన తెలుగు కళా సమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడ్డికి పురస్కారం అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాదిరెడ్డి కొండారెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ సమయంలో క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు, భోజనాలు ఇతర వసతుల కల్పన, బాధితులకు రవాణా సౌకర్యం కల్పించడం వంటి విశేష సేవలందించినందుకుగాను అప్పటి మహారాష్ట్ర గవర్నర్ కోషియార్ చేతుల మీదుగా 2021లో కోవిడ్ వారియర్స్ అవార్డుతో పాటు పలు సేవా కార్యక్రమాలకు సంబంధించి అనేక అవార్డులు అందుకోవడం జరిగిందన్నారు. కానీ.. సొంత రాష్ట్రంలో ఇటువంటి ప్రతిష్టాత్మకమైన ఉగాది పురస్కారం అందుకోవడం గర్వంగా ఉందన్నారు. ఏపి ప్రభుత్వం పురస్కారాలు ప్రధానం విషయంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికి, తెలుగు మరియు సంస్క్రత అకాడమి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం అందుకోవడం తన బాధ్యతను మరింత పెంచిందని తెలిపారు.