అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైయస్.జగన్ మరోమారు అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. పగడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో రేపు ఉదయం వీడియో కాన్ఫరెన్స్ద్వారా మరోమారు సమీక్ష చేస్తానన్నారు.
పొలాల్లో, కలాల్లో ఉన్న ధాన్యం తడిపోకుండా పౌరసరఫరాలశాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ధాన్యం తడిపిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే బాధ్యతను తీసుకోవాలన్నారు. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేసి, ఆ ధాన్యాన్ని భద్రమైన ప్రాంతాలకు తరలించాలని సీఎం స్పష్టంచేశారు. దీనిపై పురోగతిని వెంటనే తనకు తెలియజేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు. కార్పొరేషన్లు, మున్సిపాల్టీల్లో భారీవర్షాలు కారణంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సంబంధిత అధికారులను ఆదేశించారు.