-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేశ రాజ్యాంగం ప్రతిఒక్కరికీ మార్గదర్శకమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా సత్యనారాయణపురం గాయత్రీ కళ్యాణ మండపం వద్ద శుక్రవారం ఆయన త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అత్యున్నతమైనదని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. రాజ్యాంగం పౌరులకు హక్కులతో పాటు బాధ్యతలను కూడా కల్పించిందని పేర్కొన్నారు. ప్రజలైనా, పాలకులైనా, అధికారులైనా రాజ్యాంగబద్దంగా వారి పాత్రలను నిర్వర్తించాలని.. అప్పుడే అందుకు తగిన గౌరవం లభిస్తుందని అభిప్రాయపడ్డారు. భారత రాజ్యాంగంలోని విలువల కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలని.. గణతంత్ర దినోత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో పోరాటయోధుల ఆత్మార్పణ ఫలమని మల్లాది విష్ణు పేర్కొన్నారు. అటువంటి మహనీయుల త్యాగాలను స్మరించుకుని వారి ఆదర్శాలకు పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, కొంగితల లక్ష్మీపతి, నగర మహిళ అధ్యక్షురాలు పిల్లి కృష్ణవేణి, నాయకులు జొన్నవిత్తుల సుబ్బారావు, దోనేపూడి శ్రీనివాస్, చల్లా సుధాకర్, జె.కె.సుబ్బారావు, లంకా బాబు, యల్లాప్రగఢ సుధీర్, సనత్, కొండా, చాంద్ శర్మ, హనుమాన్ ప్రసాద్, మారుతీ ప్రసన్న, మందా రాంబాబు, పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.