-పేదల సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబునాయుడు కే సాధ్యం.
-మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్.
-రెడ్డిగూడెం మండలంలోని కుదపలో ఎన్నికల ప్రచారం.
-మండుటెండలో ప్రజలకోసం కష్టపడుతున్న కృష్ణప్రసాదు
ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
ధరలు పెంచి దోచుకుని పేదలకు సంక్షేమ పథకాలను అమలుజేయడం కాదని, పేదల సంక్షేమంతో కూడిన అభివృద్ధి చంద్రబాబు నాయుడు కే సాధ్యమని, పేదలు అన్ని విధాలుగా ఆర్ధికంగా ఎదగటమే ఎన్డీఏ మహాకూటమి లక్ష్యమని మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. రెడ్డిగూడెం మండలంలోని కుదపలో శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. మండుటెండలో ఆయన ప్రచారం కొనసాగింది.
వసంత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ మహాకూటమి విజయం సాధిస్తుందన్నారు. అందరికీ మంచి రోజులు వస్తాయన్నారు. అభివృద్ధితో కూడిన సంక్షేమం వల్ల పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. మైలవరం నియోజకవర్గంలోని వివిధ గ్రామాల్లో చెరువులను రిజర్వాయర్లుగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఎన్నోసార్లు వినతి పత్రాలు సమర్పించినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తి అయితే ఈ ప్రాంతంలో ఏడాదికి రెండు పంటలు పండించడానికి పుష్కలంగా సాగునీరు లభించేదన్నారు. ఐదేళ్లలో ఒక రూపాయి కూడా ఈ పథకానికి నిధులు విడుదల చేయలేదన్నారు. మైలవరం ప్రాంతంపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకింత కక్ష కట్టారని ప్రశ్నించారు. అమరావతిని సర్వనాశనం చేయడం వల్ల ముఖ్యంగా మన మైలవరం నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గ అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ప్రధాని మోడీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గణనీయంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. బటన్ నొక్కుతున్నా ఎన్నో పథకాల సొమ్ము పేదల ఖాతాల్లో జమ కావడం లేదన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులకు వైసీపీ ప్రభుత్వంలో విలువ లేదన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. వాలంటీర్లకు రూ.10 వేలు, పింఛన్లు రూ4,000లు, దివ్యాంగులకు పెన్షన్ రూ.6000లు, రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.1500లు, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు రూ.3000ల నిరుద్యోగ భృతి, తల్లికి వందనం- ఒకో బిడ్డకు రూ.15000లు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, రైతులకు ఏటా రూ.20 వేలు, ఉద్యోగాలు కల్పన, మెగా డీఎస్సీ తదితర పథకాల గు రించి ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.