రాయబరేలి, నేటి పత్రిక ప్రజావార్త :
రాయబరేలి ప్రజలకు ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కీలక అభ్యర్థన చేశారు. నియోజకవర్గం ప్రజలు తనను ఆదరించినట్టే తన కుమారుడు రాహుల్ గాంధీ ని కూడా అక్కున చేర్చుకోవాలని కోరారు. ప్రజల ఆశలను రాహుల్ ఏమాత్రం వమ్ము చేయరని అన్నారు. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా తొలిసారి సోనియాగాంధీ రాయబరేలిలో శుక్రవారంనాడు ప్రసంగించారు. సోనియాగాంధీతో పాటు ఆయన కుమారుడు, రాయబరేలి కాంగ్రెస్ అభ్యర్థి రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకగాంధీ కూడా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు.
”చాలా కాలం తర్వాత మీ మధ్యకు రాగలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఎంపీగా మీకు సేవలందించే అవకాశం నాకు కలిగించారు. నా జీవితంలో ఎప్పటికీ దీన్ని మరిచిపోలేను. గత వందేళ్లుగా ఈ గడ్డతో మా కుటుంబ అనుబంధం వేళ్లూనుకుని ఉంది. ఈ అనుబంధం గంగాజలంలా స్వచ్ఛమైనది. అవథ్, రాయబరేలిలో రైతుల ఆందోళనతో ఈ అనుబంధం మొదలైంది” అని సోనియాగాంధీ పేర్కొన్నారు. రాయబరేలి ప్రజలు, మాజీ ప్రధాని దివంగత ఇందిరా గాంధీ ద్వారా తాను నేర్చుకున్న పాఠాలే తన పిల్లలైన రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీకి నేర్పానని చెప్పారు. రాయబరేలి ప్రజలకు ఇందిరాగాంధీ హృదయంలో ప్రత్యేక స్థానం ఉండేదని, ఆమె పనితీరును తాను చాలా దగ్గర నుంచి పరిశీలించానని, ఇక్కడి ప్రజలంటే ఆమెకు ఎనలేని అభిమానం ఉండేదన్నారు. ఇందిరాంగాంధీ నుంచి నేర్చుకున్న పాఠాలనే తాను తన పిల్లలకు చెప్పానని తెలిపారు. అందరినీ గౌరవించడం, బలహీనులను పరిరక్షించడం, ప్రజల హక్కులపై జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి పోరాడటం, ఎలాంటి భయాలకు తావీయకుండటం వంటి పాఠాలు వారికి నేర్పానని చెప్పారు. రాయబరేలి ప్రజల ప్రేమ కారణంగా తనకు ఒంటరిగా ఉన్నాననే భావన ఎప్పుడూ కలగలేదని సోనియాగాంధీ అన్నారు. ”ఈరోజు నా కుమారుడిని మీ చేతుల్లో పెడుతున్నాను. అతన్ని ఆదరించండి. నన్ను ఎలా ఆదరించాలో నా కుమారుడిని కూడా గుండెల్లో పెట్టుకోండి. రాహుల్ మీ ఆశలను వమ్ము చేయడు” అంటూ సోనియాగాంధీ భావోద్వేగానికి గురయ్యారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ… జూన్ 4న ప్రభుత్వం ఏర్పడుతుందని, జూలై 4న లక్షలాది కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ₹ 8,500 జమ అవుతుందన్నారు. ఒకసారి కాదు, తరువాతి నెలల్లో కూడా” అని అన్నారు. భారతదేశంలో కోటి మందిని కోటీశ్వరులను తయారు చేయాలి.. ‘నరేంద్ర మోదీ 22 మందిని బిలియనీర్లుగా మార్చారు, మేం కోట్లాది మందిని కోటీశ్వరులను చేస్తాం’ అని రాహుల్ గాంధీ అన్నారు.