-సూపరింటిండెంట్ ఎస్, రాహుల్
రాజమహేంద్రవరం,, నేటి పత్రిక ప్రజావార్త :
ఖైదీల భద్రత, పరివర్తనకే జైళ్ళు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయని రాజమండ్రి కేంద్ర కారాగార సూపరింటిండెంట్ ఎస్. రాహుల్ పేర్కొన్నారు. జైల్లో ఖైదీల అందరికీ నేత్ర పరీక్షలు నిర్వహించి అవసరమైతే శస్త్ర చికిత్సలు చేసే వైద్య శిబిరాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. పలువురు వృద్ద ఖైదీలకు పరీక్షలు అనంతరము స్వయంగా కళ్ళజోళ్ళు తొడిగి, వాటిని అందజేశారు.ఈ సందర్భంగా శ్రీరామ్ రాహూల్ మాట్లాడుతూ జైల్లో అందిస్తున్న పలు రకాల సేవలను ఖైదీలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జైళ్ల శాఖ అందిస్తున్న శిక్షణను ఉపయోగించుకుంటూ మానసిక పరివర్తన చెంది విడుదల అయిన తర్వాత కుటుంబానికి, సమాజానికి ఉపయోగపడాలని కోరారు. ఖైదీలు కంటిచూపు పట్ల తగు శ్రద్ధ వహించాలన్నారు. కంటి చూపు జీవితానికి చుక్కాని లాంటిది అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సూపరింటెండెంట్లు ఎం రాజకుమార్, బి రత్న రాజు మాట్లాడుతూ ఐదు వారాలపాటు ప్రతి శనివారం ఈ నేత్ర శిబిరాన్ని నిర్వహించి, పరీక్షలు చేసి అవసరం మేర మందులు ఇవ్వడం, శస్త్ర చికిత్సలు చేయించడం, కళ్ళజోళ్ళు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.వేమగిరి పరమహంస యోగానంద నేత్రాలయం ఆధ్వర్యంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ప్రణీత్, కోఆర్డినేటర్ ఎన్. చంటిబాబు ఆధ్వర్యంలో సిబ్బంది వైద్య పరీక్షలు చేయగా, ఆమెన్ ట్రస్ట్ చైర్మన్ ఇవాంజిలిన్, అశోక్ అవసరమైన ఖైదీలకు కళ్ళజోళ్ళు బహూకరించారు.ఈ కార్యక్రమంలో జైలర్లు ఆర్. శ్రీనివాసరావు . కెవి. రామారావు, డాక్టర్ కోమల, సోషల్ ఇంక్యుబేషన్ సభ్యులు చిలుకూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.