మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
హింసకు గురైన మహిళలు బాలికలకు అవసరమైన సేవలందించేందు కోసం సఖి కేంద్రం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం ఉదయం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక – మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన సఖి కేంద్రం గోడపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడైనా మహిళలు గాని బాలికలు గానీ హింసకు గురైతే వెంటనే 181 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.
బాలికలు, స్త్రీలపై జరిగే హింసను ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఆపుదామని, వారికి అండగా ఉండాలని సూచించారు. మచిలీపట్నంలోని పోర్టు రోడ్డులో సఖి కేంద్రం వన్ స్టాప్ సెంటర్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. అందులో హింసకు గురైన మహిళలు బాలికలకు ఐదు రోజులపాటు వసతి సౌకర్యం తో పాటు వైద్య సేవలు, కౌన్సిలింగ్ సేవలు, పోలీస్ సహాయము, న్యాయ సహాయము అందిస్తామన్నారు. ఎవరైనా అవసరమైతే చైల్డ్ హెల్ప్ లైన్ నంబరు 1098, లేదా అత్యవసర టోల్ ఫ్రీ నెంబర్లు 100 లేదా 112 కు ఫోన్ చేసి వివరాలు తెలియజేయవచ్చన్నారు. ఫోన్ కాల్ అందిన వెంటనే బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని తెలిపారు. జిల్లాలోని సఖి కేంద్రాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డిఆర్ఓ కే చంద్రశేఖర రావు, ఐసిడిఎస్ పిడి సువర్ణ, ఆర్డిఓ ఎం వాణి తదితర అధికారులు పాల్గొన్నారు.