– స్త్రీ, శిశు సంక్షేమ శాఖపై సమీక్షలో కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకలాపాలు పూర్తిస్థాయిలో లక్ష్యాలకు అనుగుణంగా సాగాలని.. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యను అత్యంత నాణ్యతతో అందించడంపై ప్రత్యేకంగా దృష్టిసారించాలని కలెక్టర్ డా. జి.సృజన అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ సృజన.. గురువారం కలెక్టరేట్లోని ఛాంబర్లో జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కార్యక్రమాలు, పథకాలు, సంస్థల ద్వారా స్త్రీ, శిశు సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్, టీకాలు, ఆరోగ్య పరీక్షలు; పోషణ, ఆరోగ్య విద్య, పూర్వ ప్రాథమిక విద్య తదితరాలకు సంబంధించిన వివరాలను అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య సరైన విధంగా అందేలా చూడాలన్నారు. పూర్వ ప్రాథమిక విద్య అనేది.. భవిష్యత్తు అభ్యసనానికి గట్టి పునాది వేస్తుందని… దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పూర్వ పాఠశాల విద్యనందించాలని సూచించారు. మెనూ ప్రకారం పోషకాహారాన్ని అందించాలన్నారు. అదే విధంగా పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం పటిష్ట అమల్లో భాగంగా కార్యాలయాల్లో ఇంటర్నల్ కంప్లయింట్ కమిటీ (ఐసీసీ)ల ఏర్పాటు తప్పనిసరిగా జరగాలని స్పష్టం చేశారు. వన్ స్టాప్ సెంటర్, చిల్డ్రన్ హోమ్స్, స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (ఎస్ఏఏ), మిషన్ శక్తి తదితరాలపైనా సమావేశంలో చర్చించారు. సమావేశంలో ఐసీడీఎస్ పీడీ జి.ఉమాదేవి, డీసీపీవో రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.