– ఎనిమిది స్టాక్ పాయింట్లలో 3,69,588 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక
– తవ్వకం, రవాణా, లోడింగ్, సీనరేజీ ఫీజు నామమాత్రపు వసూలు
– ఈ మొత్తం నుంచి ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లదు
– రీచ్ ప్రాంత రహదారులు, ర్యాంపుల వంటి అభివృద్దికి మాత్రమే వినియోగం
– డీఎల్ఎస్సీ సమావేశంలో జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజాప్రయోజనార్థం రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానాన్ని పటిష్టంగా అమలుచేసేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఆదేశించారు.
గురువారం కలెక్టరేట్లోని ఛాంబర్లో కలెక్టర్ జి.సృజన అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్ఎస్సీ) సమావేశం జరిగింది. జిల్లాలోని వివిధ ఇసుక స్టాక్ పాయింట్లలో నిల్వలు, ఉచిత విధానం అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8వ తేదీ సోమవారం నుంచి ఉచిత ఇసుక విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించినందున…. ఈ మేరకు జిల్లాస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించి, ఆదేశాలివ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రస్తుతం 12 ఇసుక నిల్వ కేంద్రాలకు సంబంధించి ఎనిమిది కేంద్రాల్లో 3,69,588 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అందుబాటులో ఉందని తెలిపారు. ఇసుక తవ్వకం, లోడింగ్, రవాణా ఖర్చు, సీనరేజ్ ఫీజు మాత్రమే నామమాత్రంగా వినియోగదారుల నుంచి వసూలు చేయడం జరుగుతుందని.. ఈ మొత్తంలో ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ ఖజానాకు వెళ్లదని.. నేరుగా జిల్లా, మండల పరిషత్తులు, పంచాయతీలకు వెళ్తుందన్నారు. ఈ మొత్తాన్ని రీచ్ ప్రాంత రహదారులు, ర్యాంపులు తదితరాల అభివృద్ధికి వినియోగించడం జరుగుతుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాల వద్ద నామమాత్రపు రుసుం వివరాలను ప్రదర్శించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం శక్తిమంతమైన ఆన్లైన్ అనుసంధాన ఇసుక విధాన రూపకల్పనకు కసరత్తు చేస్తున్నందున ఈలోగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తెచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ, రవాణా, పోలీస్ తదితర శాఖల అధికారులు పటిష్ట అమలుకు కృషిచేయాలని… ఇందుకు ప్రణాళికాయుతంగా వ్యవహరించాలన్నారు. అదే విధంగా ఇసుక కొరత లేకుండా చూసేందుకు పూడిక రూపంలో ఉన్న ఇసుక పాయింట్లను కూడా గుర్తించాలని కలెక్టర్ సృజన ఆదేశించారు. సమావేశంలో మైన్స్ అండ్ జియాలజీ డిప్యూటీ డైరెక్టర్ జి.వెంకటేశ్వర్లు, గ్రామీణ నీటి సరఫరా ఎస్ఈ డీవీ రమణ, డీపీవో ఎన్వీ శివప్రసాద్ యాదవ్, గ్రౌండ్ వాటర్ డీడీ బి.నాగరాజు, డీటీసీ ఎం.పురేంధ్ర, పీసీబీ ఈఈ పి.శ్రీనివాసరావు, వివిధ మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
వివిధ స్టాక్ పాయింట్లలో అందుబాటులో ఉన్న ఇసుక (క్యూబిక్ మీటర్లు)
1. పెండ్యాల (కంచికచర్ల మండలం)- 19,781
2. మాగల్లు (నందిగామ మండలం)- 36,366
3. కొడవటికల్లు (చందర్లపాడు మండలం)- 9,713
4.అల్లూరుపాడు (వత్సవాయి మండలం) – 3,040
5. అనుమంచిపల్లి (జగ్గయ్యపేట మండలం) – 56,820
6. పోలంపల్లి (వత్సవాయి మండలం) – 922
7. కీసర (కంచికచర్ల మండలం) – 1,49,703
8. మొగులూరు (కంచికచర్ల మండలం) – 93,243