– డిఆర్వో వి. శ్రీనివాసరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలన్న ప్రభుత్వ ఆకాంక్షను నెరవేర్చేలా అధికారులు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన అర్జీలకు పరిష్కారం చూపేందుకు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జిల్లా రెవిన్యూ అధికారి వల్లభనేని శ్రీనివాసరావు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారులు నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరిస్తున్న అర్జీలను అలసత్వం లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందే స్థాయిలో నాణ్యతతో పరిష్కారం చూపాలన్నారు. అర్జీలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని , తిరిగి మరల నమోదవుతున్న అర్జీలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే నమ్మకంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి ప్రజలు వినతులు సమర్పించుకుంటారన్నారు. సమస్యలను పరిష్కరించడం అధికారుల గురుతర బాధ్యత అని ఆయన అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 127 అర్జీలు స్వీకరించగా.. .వీటిలో రెవిన్యూ -41, మునిసిపల్ కార్పొరేషన్ -16, పోలీస్ -15, విద్య శాఖ -7, సర్వే -6, ఉపాధికల్పన -6, వైద్య ఆరోగ్య శాఖ -5, డీఆర్డీఏ -4, పంచాయితీరాజ్ -4, గురుకుల విద్యాలయాల సంస్థ -4, విద్యుత్ -2, సాంఘిక సంక్షేమం -2, కోపరేటివ్ -2, ఏపీ ఎస్ ఆర్ టి సి -1, మార్కెటింగ్ -1, వ్యవసాయ శాఖ -1, మహిళా శిశు సంక్షేమం -1, పౌర సరఫరాలు -1, దేవాదాయ -1, అటవీ శాఖ -1, రోడ్డు భవనాలు -1, రిజిస్ట్రేషన్ -1, ప్రొహిబిషన్ -1, దివ్యంగులు శాఖ -1, లీడ్ బ్యాంకు -1 గా నమోదైనట్లు డిఆర్వో తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ కె. శ్రీనివాసరావు, డ్వామా పీడీ జె. సునీత, హౌసింగ్ పీడీ రజిని కుమారి, డియంహెచ్ఓ డా. ఎం. సుహాసిని, ఐసీడీఎస్ పీడీ జి. ఉమాదేవి, మార్క్ ఫెడ్ డిఎం నాగమల్లిక, వ్యవసాయ అధికారిణి ఎస్. నాగమణేమ్మ, ఉద్యాన అధికారి బాలాజీ కుమార్, డీఐపీఆర్వో యు. సురేంద్రనాధ్, వివిధ శాఖలను చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.