-బిసి సంక్షేమ శాఖ, చేనేత&జౌళి శాఖ మంత్రి సవిత
-కళాకారులకు గౌరవం పెంచిన పార్టీ టిడిపి
-కొండపల్లిని టూరిజం హబ్ గా మారుస్తాం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హస్తకళాకారులకు అన్నివిధాలా తోడ్పాటు అందించి పూర్వ వైభవాన్ని తీసుకోస్తామని బిసి సంక్షేమ శాఖ, చేనేత & జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. సోమవారం ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లిలో ఉన్న కొండపల్లి బొమ్మల తయారీ కేంద్రాలను సందర్శించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్బంగా మంత్రి మాట్లాడుతూ హస్తకళాకారుల సమస్యలు తెసుకునేందుకే తాను కొండపల్లికి వచ్చానని మీరు చెప్పిన ప్రతి సమస్యను తీర్చేందుకు కృషిచేస్తానని కళాకారులకు హామీ ఇచ్చారు. బొమ్మల తయారీకి ఆశక్తి ఉన్నవారికి ఇచ్చే శిక్షణా కార్యక్రమం కాలపరిమితిని ఏడాదికి పెంచేందుకు కృషిచేస్తానని తెలిపారు. హస్తకళాకారులకు బొమ్మల తయారీకి కావాల్సిన పనిమూట్లను అందుబాటులో ఉండే ధరకే దక్కేలా చూడడంతో పాటు కళాకారులకు ఉచిత ఇండ్ల పంపిణికి కృషిచేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ఏర్పాటు చేసి మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. కొండపల్లి బొమ్మల కళను ప్రోత్సహించింది శ్రీకృష్ణదేవరాయలని, ఆయన స్పూర్తితో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కొండపల్లి హస్తకళాకారులను ప్రోత్సహించారని చెప్పారు. మహిళలు కూడా కొండపల్లి బొమ్మల తయారీలో భాగమవ్వడం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు. హస్తకళాకారులకు అన్ని విధాల తోడుగా నిలబడి కొండపల్లి బొమ్మలకు అంతర్జాతీయ మార్కెట్ ను పెంచుతామని హామీ ఇచ్చారు. అధికారులు, నాయకులు లేపాక్షి కేంద్రాల్లో బొమ్మలను కొనుగోలు చేసి సత్కార కార్యక్రమాల్లో బహుకరించాలని కోరారు. కొండపల్లిని టూరిజం హబ్ మార్చి ఇక్కడి కొండపల్లి బోమ్మల కొనుగోలును పెంచుతామని చెప్పారు. మంత్రి పర్యటనలో సబ్ కలెక్టర్ సిహెచ్ భవాని శంకర్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు, డిసిహెచ్ ఎడి అపర్ణ, ఏపీ హ్యాండిక్రాప్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం విశ్వం, కౌన్సిలర్ చిట్టిబాబు, టిడిపి నాయకులు పాల్గొన్నారు.
మంత్రి మానవతా హృదయం
కొండపల్లి పర్యటనలో మంత్రి మానవతా హృదయం చాటుకున్నారు. అనారోగ్యంతో ఇబ్బందిపడుతున్న పేద కళాకారుడికి పదివేలు ఆర్థిక సహాయం అందించారు. దీంతోపాటు కళాకారుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సబ్ కలెక్టర్ కు సూచించారు.