– జిల్లా కలెక్టర్ డా. జి.సృజన
– యుద్దప్రాతిపదికన తీసుకోనున్న చర్యలను వివరించిన ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తాత్కాలిక పునరుద్ధరణ పనులతో మున్నేరు ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు ఖరీఫ్-2024కు సాగునీరుకు ఇబ్బంది లేకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డా. జి.సృజన ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
మంగళవారం జిల్లా కలెక్టర్ జి.సృజన, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, జగ్గంపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య).. వత్సవాయి మండలం, పోలంపల్లి గ్రామ సమీపంలోని మున్నేరు ప్రాజెక్టును సందర్శించారు. అదే విధంగా 2023, జులై వరదలకు మున్నేరు పాత ఆనకట్ట వద్ద గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. తొలుత ఇరిగేషన్ ఎస్ఈ టీజేహెచ్ ప్రసాద్బాబు, ఈఈ పి.గంగయ్యలు నీటి విడుదలకు ఎదురవుతున్న సమస్యలను, వాటి పరిష్కారానికి అందుబాటులో ఉన్న మార్గాలను కలెక్టర్కు వివరించారు. తెలంగాణలోని పెదమండవ గ్రామం వైపున్న గండిని పూడ్చే పనులపై ఆ ప్రాంత రైతులు గతంలో వరదల సమయంలో పంట నష్టం జరిగిన రైతులందరికీ పరిహారం అందించాలని, భవిష్యత్తులో తమ పంటలు ముంపునకు గురికాకుండా శాశ్వత పనులు చేపట్టాలంటూ చేస్తున్న డిమాండ్లను కూడా తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ సృజన మాట్లాడుతూ ఇప్పటికే 36 ఎకరాలకు సంబంధించి రూ. 55 లక్షల మేర పరిహారం అందించామని.. లబ్ధి జరక్కుండా మిగిలిపోయిన రైతులను రీసర్వే ద్వారా గుర్తించి పరిహారం అందించేందుకు ప్రస్తుతం చర్యలు తీసుకున్నందున వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల పరిధిలోని ఆయకట్టుకు ఖరీఫ్లో సాగునీటికి ఇబ్బంది లేకుండా నీటి విడుదలకు సహకరించాలని తెలంగాణ ప్రాంత అధికారులు, రైతులను కలెక్టర్ కోరారు. అదేవిధంగా గండిని పూడ్చేందుకు సమయం పడుతుందని.. ఈలోగా నదిలోనే క్రాస్బండ్స్ వేసి వత్సవాయి, పెనుగంచిప్రోలు, నందిగామ మండలాల రైతులకు ఖరీఫ్కు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులకు ఆదేశించారు. తెలంగాణవైపున్న రైతులకు ఏవైనా సమస్యలు ఉంటే వాటిని చిత్తశుద్ధితో పరిష్కరించనున్నట్లు కలెక్టర్ సృజన పేర్కొన్నారు.
జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య మాట్లాడుతూ కొత్త మున్నేరు ప్రాజెక్టు కార్యకలాపాల ప్రారంభానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకు ఎదురవుతున్న సమస్యలను గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లానని.. ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని తెలిపారు.