-జాయింట్ కలెక్టర్*ధ్యాన చంద్ర హెచ్ ఎం
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలలో లబించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సంయుక్త కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ఎం పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక తిరుపతి రైతు బజార్ నందు కందిపప్పు, బియ్యం ప్రజలకు అందుబాటు ధరలకు ఉండేలా ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు అదుపులో ఉంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ధరలను తగ్గించి వినియోగదారులకు ఉపశమనం కలిగించటానికి ప్రభుత్వ స్థాయిలో హోల్సేల్ కిరాణా మర్చెంట్స్ మరియు రైస్ మిల్లర్స్ ప్రతినిధులతో రాష్ట్రస్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసి నిత్యావసర సరుకుల ధరలు తగ్గించి వినియోగదారులకు అందించే విధంగా ఒప్పందం కుదుర్చుకుందని, ఈ ఒప్పందం లో భాగంగా జిల్లలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హోల్సేల్ కిరాణా మర్చెంట్స్ అసోసియేషన్ మరియు పౌర సరఫరాల శాఖ ఆద్వర్యంలో జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో దాదాపు 16 కౌంటర్లను ఏర్పాటు చేసి అందులో తిరుపతి, గూడూరు లోని రెండు రైతు బజారు కౌంటర్లతో పాటు ఏర్పాటు చేశామని, సదరు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో 16 కౌంటర్ల ద్వారా దాదాపు 593 మంది లబ్ది దారులకు 1516 కిలోల బియ్యం, 1002 కిలోల కందిపప్పు అమ్మడం జరిగిందనీ, కేజీ కందిపప్పు ధర మార్కెట్ లో కిలో రూ.181 ఉండగా రూ.160 కు అమ్మడం జరుగుతోందని, స్టీమ్డ్ రైస్ మార్కెట్ ధర రూ.56 ఉండగా రూ.49 కి అమ్మడం జరుగుతోందని, పచ్చి బియ్యం మార్కెట్ ధర రూ.53 ఉండగా రైతు బజార్లలో రూ.48 అమ్మడం జరుతోందని, వినియోగ దారులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసినదిగా జెసి కోరారు. అలాగే సంబంధిత నియోజక వర్గాల్లో ఎమ్మెల్యే లు, ఎంపీ లు సదరు కార్యక్రమాన్ని వారి పరిధిలో నేడు గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి రాజా రఘువీర్, తదితరులు పాల్గొన్నారు.