-4వ డివిజన్ లో పలు సిసి రోడ్లకు శంకుస్థాపన
-నోవోటెల్ హోటల్ వైపు సర్వీసు రోడ్డు పరిశీలన
-పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులకి ఆదేశాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగర పాలక సంస్థలో 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిధులు మిగలాలని ఆ రోజు చేపట్టిన కార్యక్రమాల వల్లే మిగులు బడ్జెట్ వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే వున్నపరిస్థితుల్లో కూడా సిసి రోడ్లు నిర్మాణ పనులు చేపట్టడానికి ఆ మిగులు బడ్జెటే కారణమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. 4వ డివిజన్ లో భారతీ నగర్ 6వ రోడ్ కు, శ్రీనగర్ కాలనీలో వివేకానంద రోడ్ లో నిర్మాణం చేయనున్న సిసి రోడ్లకు గురువారం ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తో కలిసి కొబ్బరి కాయలు కొట్టి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించారు.
భారతీనగర్ 6వ రోడ్ లోని సౌభాగ్య గ్రాండ్ అపార్ట్మెంట్స్ వాసులు సిసి రోడ్ శాంక్షన్ చెప్పినందుకు ఎంపి కేశినేని శివనాథ్ , ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ , కార్పొరేటర్ జాస్తి సాంబశివరావులను శాలువాలతో సత్కరించారు. వివేకానంద రోడ్ లో సిసి రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ లను టిడిపి జాతీయ అధికార ప్రతినిధి పరకాల పట్టాభిరామ్ మర్యాద పూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎంపి కేశినేని శివనాథ్ మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాడంగా పనిచేసిందో తెలుసు. నగరంలో ఎన్నో చక్కటి రోడ్లు నిర్మించుకోవటం జరిగింది. జగన్ పాలనలో ఒక తట్టెడు మట్టి కూడా వేయలేదు. 2019 నుంచి 2023 వరకు నగరపాలక సంస్థలో నిధుల దుర్వినియోగం జరిగింది. దాని పై కూడా విచారణ జరగాలి..త్వరలోనే విచారణ జరిపిస్తామన్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి నిడమానరు వరకు ఫ్లై ఓవర్ నిర్మాణం జరగబోతుంది. దానికి సంబంధించి టెండర్లు కూడా పిలవబోతున్నామని తెలిపారు. ఈ ప్లై ఓవర్ నిర్మాణం జరిగితే నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు చాలా వరకు తీరతాయన్నారు.
జాప్యం చేస్తే సహించను
అలాగే నోవోటెల్ వైపు గల సర్వీస్ రోడ్ పనులను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, 4వ డివిజన్ కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు,ఎన్.హెచ్.ఎ.ఐ ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం, ఎ.డి శివప్రసాద్, ఎ.ఈ మురళీకృష్ణతో కలిసి పరిశీలించారు. పనుల జాప్యం గురించి కాంట్రాక్టర్ రాఘవేంద్రను ఎంపి కేశినేని శివనాథ్ అడగ్గా విద్యుత్ స్తంబాల మార్పు పనులు పెండింగ్ వుందని తెలిపారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ పార్వతీశం జరుగుతున్న పనులు ఏ దశలో వున్నాయో వివరించారు. విద్యుత్ అధికారులకు సమన్వయ లోపం లేకుండా పనులు ఆలస్యం చేయకుండా ఐదు రోజుల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమిషనర్ ఇన్చార్జ్ డాక్టర్ ఎ.మహేష్, జోనల్ కమిషనర్ -3 ఎస్.శివరామకృష్ణ, ఈఈ-3 జి. సామ్రాజ్యం, కార్పొరేటర్లు ముమ్మనేని ప్రసాద్, చెన్నుపాటి ఉషారాణి తదితరులు పాల్గొన్నారు.