తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ మరియు తిరుపతి స్మార్ట్ సిటీ ఆఫ్ చైర్మన్ ఎస్. వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మధ్యాహ్నం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్ నందు తిరుపతి స్మార్ట్ సిటీ బోర్డ్ మీటింగ్ జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన వివిధ రకాల పనులను నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరా మైదానం లోని ఇండోర్ స్టేడియంకు సంబంధించిన పనులను ఆగస్టు 15 లోపు పూర్తిచేయాలని తెలిపారు. గొల్లవాని గుంటలోని క్రికెట్ స్టేడియం పనులను రెండు నెలల లోపు పూర్తిచేయాలని అన్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ ఏజన్సీ తో మాట్లాడి వైజాగ్, కాకినాడ ప్రాజెక్టుల కన్నా ఎక్కువ సౌకర్యాలు ఉండేలాగా చూడాలని తెలిపారు. సోలార్ పవర్ ప్రాజెక్ట్ ప్రత్యేక నివేదిక ప్రభుత్వానికి పంపాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వo నుంచి రావాల్సిన నిధుల కొరకు ప్రతిపాదనలు పంపాలని కమిషనర్ కు సూచించారు. తిరుపతి స్మార్ట్ సిటీ నిర్మాణానికి సంబంధించిన పురోగతిలో ఉన్న పనులు, స్మార్ట్ సిటీ నిధులు, మంజూరు కాబడిన పనుల వివరములను మున్సిపల్ కమిషనర్ అతిది సింగ్ కలెక్టర్ గారికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలియజేసారు.
ఈ సమావేశంలో ఎస్ ఈ మోహన్, స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ వి.ఆర్. చంద్ర మౌళి , ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ సిబ్బంది, ఇంజనీరింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.